భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డేలో వింత ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా బౌలర్లు తమ రన్నప్ను కంట్రోల్ చేసుకోలేక బౌలింగ్ చేసే సమయంలో క్రీజు దాటితే నోబాల్ ఇస్తారని తెలిసిందే. అలాగే బౌలర్లు వేసిన డెలివరీ ఒక్కసారి కూడా నేలను తాకకుండా బ్యాటర్ నడుం కన్నా ఎత్తుకు వచ్చినా నోబాల్ ఇస్తారు. ఈ రెండు సందర్భాల్లో బ్యాటర్లకు ఒక ఫ్రీహిట్ దొరుకుతుంది.
అయితే భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్లో ఈ రెండూ కాకుండా మరో రకమైన నోబాల్ కనిపించింది. భారత బ్యాటింగ్ సమయంలో శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఉండగా ఈ ఘటన జరిగింది. మెహదీ హసన్ వేసిన 21వ ఓవర్ చివరి రెండు బంతులకు అతను నోబాల్స్ వేశాడు. ఆ ఓవర్ ఐదో బంతి వేసే సమయంలో తడబడిన మెహదీ హసన్.. బంతిని డెలివర్ చేసే సమయంలో నాన్స్ట్రైకర్ ఎండ్లోని వికెట్లను కాలితో తన్నేశాడు. దీంతో దాన్ని అంపైర్లు నోబాల్గా ప్రకటించారు.
ఆ మరుసటి బంతికి కూడా సేమ్ టు సేమ్ అదే పొరపాటు చేశాడు మెహదీ హసన్. బంతిని వేసేటప్పుడు కాలితో వికెట్లను పడగొట్టాడు. దీంతో దాన్ని కూడా నోబాల్గా అంపైర్లు ప్రకటించారు. తొలి నోబాల్కు వచ్చిన ఫ్రీహిట్ను ఉపయోగించుకోలేకపోయిన శ్రేయాస్ అయ్యర్ సింగిల్ మాత్రమే తీశాడు. రెండోసారి వచ్చిన ఫ్రీహిట్కు ఫోర్ బాదాడు.
కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. మెహదీ హసన్ (100 నాటౌట్) చెలరేగడంత 271 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు తడబడ్డారు. టాపార్డర్ మరోసారి విఫలమైంది. శ్రేయాస్ అయ్యర్ (82), అక్షర్ పటేల్ (56) మిడిలార్డర్లో రాణించారు. జట్టు అవసరం కొద్దీ బొటన వేలి గాయంతోనే మైదానంలోకి వచ్చిన రోహిత్ శర్మ (51 నాటౌట్) చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. కానీ ఈ మ్యాచ్లో భారత జట్టు ఐదు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.