న్యూఢిల్లీ: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ఐపీఎల్ 2023 ఆడేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే మినీ వేలానికి రిజిస్టర్ చేసుకున్న అతను కెరీర్లో తొలి ఐపీఎల్ సీజన్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం ఐపీఎల్లోకి వచ్చే ప్రయత్నం చేసినా.. ఫ్రాంచైజీలు అతన్ని తీసుకోలేదు. 2018 మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా నిలిచిపోయాడు. ఆ తర్వాత మళ్లీ ఐపీఎల్ ఆడే ప్రయత్నం జో రూట్ కూడా చేయలేదు. అయితే ఈ సారి ఐపీఎల్ 2023 మినీ వేలానికి రిజిస్టర్ చేసుకున్నాడు. అయితే కొత్తగా రెండు జట్లు వచ్చిన నేపథ్యంలో ఏదో జట్టు కనీస ధరకు అయినా అతన్ని తీసుకునే అవకాశం ఉంది.
అయితే ఎన్నడూ లేనిది ఇప్పుడు ఐపీఎల్ ఆడేందుకు జో రూట్ ఆసక్తికనబర్చడం వెనుక మాస్టర్ ప్లానే ఉంది. వచ్చే ఏడాది భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్ 2023 జరగనుంది. ఈ టోర్నీ కోసమే జో రూట్ ఐపీఎల్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. అప్కమింగ్ ఐపీఎల్.. దేశవ్యాప్తంగా పాత పద్దతిలో(హోమ్ అండ్ అవే) జరగనుంది. ఈ క్రమంలో ఐపీఎల్ 2023 ఆడితే భారత్ పిచ్లు, మైదానాలపై ఓ అవగాహన వస్తుందనేది జో రూట్ ప్లాన్. ఇది ప్రపంచకప్లో అతనికి ఇంగ్లండ్ జట్టుకు ఉపయోగపడుతుందని జో రూట్ భావిస్తున్నాడు.
అందుకే కనీస ధరక అమ్ముడు పోయినా సరే ఐపీఎల్ 2023 ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జోరూట్ ఇదే విషయాన్ని వెల్లడించాడు. తనకు ఎంత తక్కువ ధర వచ్చినా పర్వాలేదని, అసలు ధరతో తనకు సంబంధంలేదని, ఐపీఎల్ ఆడితే చాలని చెప్పాడు. మార్చి-ఏప్రిల్లో జరిగే ఐపీఎల్ 2023లో ఆడటం ద్వారా భారత్లో అన్ని పిచ్లు, మైదానాలపై పట్టు సాధించవచ్చనేది జోరూట్ ప్లాన్. అంతేకాకుండా భారత బౌలర్లతో పాటు ప్రపంచ టాప్ బౌలర్లను కూడా ఐపీఎల్లో ఎదుర్కొనే అవకాశం ఉండటంతో రూట్ ఐపీఎల్ను సరైన వేదికగా భావిస్తున్నాడు.
అయితే ఐపీఎల్ 2023 మినీ వేలంలో రూట్ అమ్ముడుపోతాడా? అనేదే అసలు సమస్య. టెస్టు స్పెషలిస్ట్ అయిన జో రూట్ను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజ్ కూడా ముందుకు రాదని కొందరు అభిమానులు అంటుండగా.. మరి కొందరు మాత్రం పది ఫ్రాంచైజీలున్నాయి కాబట్టి అవకాశం దక్కవచ్చంటున్నారు. ఆ ధైర్యంతోనే జో రూట్ వేలానికి వస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందనే ఆలోచనలో కూడా ఫ్రాంచైజీలు తీసుకోవచ్చని చెబుతున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్లో వన్డే ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే.