
ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 15మంది సభ్యులతో కూడిన ఆ దేశ జాతీయ జట్టును ప్రకటించింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మహ్మదుల్లా రియాద్ను ఎంపిక చేయలేదు. గత కొన్ని నెలలుగా మహ్మదుల్లా ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. ఈ ఏడాది మొదట్లో మహ్మదుల్లాను బంగ్లాదేశ్ టీ20జట్టు కెప్టెన్గా కూడా బోర్డు తొలగించిన సంగతి తెలిసిందే. ఇక మూడేళ్ల తర్వాత పునరాగమనం చేసిన సబ్బీర్ రెహమాన్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అతను ఆసియా కప్లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. నూరుల్ హసన్ సోహన్, లిటన్ దాస్ తమ గాయాల నుంచి కోలుకున్నారు. దీంతో వాళ్లు తిరిగి తమ స్థానాన్ని జట్టులో పొందారు.
ఇకపోతే ఆల్రౌండర్ మహేదీ హసన్ ఆసియా కప్లో ఆడినప్పటికీ.. టీ20 ప్రపంచకప్ జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. అతను, లెఫ్ట్ హ్యాండర్ సౌమ్య సర్కార్, లెగ్ స్పిన్నర్ రిషాద్ హొస్సేన్, లెఫ్ట్ ఆర్మర్ షోరిఫుల్ ఇస్లాం స్టాండ్బై ప్లేయర్ల లిస్టులో ఉన్నారు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత యాసిర్ అలీ చౌదరి, హసన్ మహమూద్లను కూడా జట్టులోకి తీసుకున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చీఫ్ నజ్ముల్ హసన్ పాపోన్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ కంటే తర్వాత రాబోయే టీ20 వరల్డ్ కప్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే.
అలాగే ఆసియా కప్కు ముందు.. బంగ్లాదేశ్ T20 సెటప్తో ఓవర్ నైట్ రిజల్ట్స్ ఆశించడం సరైనది కాదని ఆ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా చెప్పాడు. టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ తొలి మ్యాచ్ అక్టోబర్ 24న హోబర్ట్లోని బెల్లెరివ్ ఓవల్లో క్వాలిఫయర్తో జరుగుతుంది. ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో కిందటేడాది జరిగిన టీ20ప్రపంచకప్ సూపర్ 12దశలో బంగ్లాదేశ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిందనే సంగతి తెలిసిందే.
టీ20 వరల్డ్కప్కు ఎంపికైన బంగ్లాదేశ్ జట్టు
షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), సబ్బీర్ రెహమాన్, మెహిదీ హసన్ మిరాజ్, అఫీఫ్ హుస్సేన్ ధృబో, మొసద్దెక్ హొస్సేన్ సైకత్, లిటన్ దాస్, యాసిర్ అలీ చౌదరి, నూరుల్ హసన్ సోహన్, ముస్తాఫిజుర్ రెహమాన్, మహ్మద్ సైఫిద్దూన్, నసుమ్ మహ్మద్, నసుమ్ మహ్మద్, నసుమ్ అహ్మద్, హొస్సేన్, తస్కిన్ అహ్మద్
స్టాండ్బై ప్లేయర్లు : షోరిఫుల్ ఇస్లాం, రిషద్ హొస్సేన్, మహేదీ హసన్, సౌమ్య సర్కార్