ప్రపంచకప్లో కూడా:
ప్రపంచకప్-2019 లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన భారత్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ నుండే నిష్క్రమించాయి. రెండు మూడు స్థానాల్లో నిలిచిన ఇంగ్లండ్, న్యూజీలాండ్ ఫైనల్ చేరగా.. ఇంగ్లండ్ కప్ సాధించింది. దీంతో లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన జట్లకు ఏం ప్రయోజనం చేకూరుతుందని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నించారు. ప్రపంచకప్లో కూడా ఐపీఎల్ తరహాలో ప్లేఆఫ్స్ను అమలు చేస్తే తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు మేలు జరుగుతుందని సూచించారు.
ఐపీఎల్ తరహాలోనే వినూత్నంగా:
ఇదే సూచనను ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్లో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవేశపెట్టింది. అయితే ఐపీఎల్ తరహాలోనే వినూత్నంగా ప్లేఆఫ్స్ను తీసుకొచ్చింది. డిసెంబర్ 17 నుంచి మొదలయ్యే తొమ్మిదో సీజన్లో కొత్త తరహా ఫైనల్స్ను నిర్వహించనున్నారు. టేబుల్ టాపర్స్కు ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతో ఇలాంటి పద్ధతిని ప్రవేశపెడుతున్నారు.
బిగ్ బాష్లో ఐదు జట్లు:
పాయింట్ల పట్టికలో నిలిచిన తొలి ఐదు జట్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన జట్లకు 'ఎలిమినేటర్ మ్యాచ్' నిర్వహిస్తారు. ఈ ఎలిమినేటర్లో గెలిచిన జట్టు మూడో స్థానంలో ఉన్న జట్టుతో 'ది నాకౌట్'లో ఆడుతుంది. ఇక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు 'క్వాలిఫయిర్'లో పోటీపడుతాయి. క్వాలిఫయిర్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఓడిన జట్టు మాత్రం నాకౌట్లో విజయం సాధించిన జట్టుతో 'ది ఛాలెంజర్'లో తలపడుతుంది. ఛాలెంజర్లో గెలిచిన జట్టు ఫైనల్కు చేరుతుంది.
ఐపీఎల్లో నాలుగు జట్లు:
ఐపీఎల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు క్వాలిఫయర్-1 ఉంటుంది. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్లో తలపడతాయి. క్వాలిఫయిర్-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్లో గెలిచిన జట్టు మధ్య క్వాలిఫయర్-2 జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్కు చేరుతుంది.