ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్న బౌలర్లు:
కరోనా ఎఫెక్ట్ క్రీడలకు కూడా తాకిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కరోనా వైరస్ భారత దేశంలోనూ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బౌలర్లు కూడా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. గురువారం దక్షిణాఫ్రికాతో జరిగే తొలి వన్డేలో బంతిపై లాలాజలం (ఉమ్ము)ను ఎక్కువగా ఉపయోగించం అని టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. సాధారణంగా బంతి స్వింగ్ అవ్వడానికి, పట్టు చిక్కాడానికి బౌలర్లు లాలాజలంను ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే.
అభిమానులు విమర్శలు చేస్తారు:
మంగళవారం భువనేశ్వర్ మాట్లాడుతూ... 'మేము ఈ విషయం (లాలాజలం వాడాలా వద్దా)పై ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నేను లాలాజలం ఉపయోగించనని కచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే లాలాజలం ఉపయోగించకపోతే బంతిని షైన్ చేయలేం. అలా చేయకపోతే మేము సరిగా రాణించలేం. అప్పుడు సరిగా బౌలింగ్ చేయలేదని అభిమానులు మాపై విమర్శలు చేస్తారు' అని అన్నాడు.
తుది నిర్ణయం వారిదే:
'ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ రోజు టీమ్ మీటింగ్ ఉంది. అందులో ఈ విషయంపై చర్చిస్తాం. తుది నిర్ణయం మాత్రం జట్టు వైద్యుడు తీసుకుంటాడు. అతను మాకు ఏ సలహా ఇస్తాడో చూడాలి' అని భువనేశ్వర్ చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సాధ్యమయినంతవరకు ముందు జాగ్రత్తలు తీసుకుంటామన్నాడు. ఐపీఎల్కు కరోనా అంతరాయం కలిగిస్తుందా అని అడగ్గా.. ఇప్పుడే ఏమీ చెప్పలేం అన్నాడు.
సన్నిహితంగా ఉండలేం:
'జట్టు వైద్యుడు ఎప్పుడూ మాతోనే ఉంటున్నాడు. ఏం చేయాలో చేయొద్దో కొన్ని సూచనలు చేసాడు. పరిశుభ్రత పాటించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం లాంటి సూచనలు చేసాడు. ఇక అభిమానులు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు, పూర్తి మద్దతు ఇస్తారు. అయితే వైరస్ కారణంగా వారితో సన్నిహితంగా ఉండలేం' అని భువీ తెలిపాడు.