హైదరాబాద్: అంతర్జాతీయ మ్యాచ్ల్లో తనతో ధోని బౌలింగ్ చేయించడమే తన కెరీర్ను మలుపు తిప్పిందని టీమిండియా ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ అభిప్రాయపడ్డాడు. బెంగళూరు వేదికగా జనవరి 27, 28 తేదీల్లో జరిగిన వేలంలో కేదార్ జాదవ్ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.7.8 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్లో ధోని నాయకత్వం వహించబోయే చెన్నై జట్టుకు ఆడబోతుండటంపై జాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు. సీఎస్కే వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్యూలో 'నేను భారత్ తరుపున బౌలింగ్ చేసి వికెట్లు పడగొడుతానని కలలో కూడా అనుకోలేదు. అంతర్జాతీయ మ్యాచ్ల్లో బౌలింగ్ చేయమని ధోని భాయ్ అడిగినప్పటి నుంచే నేను భిన్నమైన ఆటగాడిగా మారనని అనుకుంటున్నా' అని జాదవ్ అన్నాడు.
'ధోని ప్రతి ఆటగాడికి ఎంతో ప్రోత్సాహం అందిస్తాడు. ప్రతి ఆటగాడు ప్రతిభను చాటుకునే అవకాశం కల్పిస్తాడు. ఇక ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో అతనికి బాగా తెలుసు. ఇదే ధోనిలోని గొప్ప లక్షణం అదే. చెన్నై జట్టుకు ఆడేందుకు ఏమైనా చేయొచ్చు. ధోని భాయ్ మైదానంలో ఉంటే చాలు. నా కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తా' అని పేర్కొన్నాడు.
'గత పదేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్లో అత్యుత్తమ జట్టుగా కొనసాగుతోంది. అలాంటి జట్టుకు ఆడటం అదృష్టం. ధోని నుంచి ఎంతో నేర్చుకోవాలని అనుకుంటున్నా. ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడటం చాలా సంతోషంగా ఉంది. పరిస్థితులను వేగంగా అర్ధం చేసుకునే తీరు ధోని సొంతం' అని జాదవ్ పేర్కొన్నాడు.