హైదరాబాద్: సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పాలక మండలి (సీఓఏ), బీసీసీఐ ఆఫీసు బేరర్ల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. భారత్ మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ స్మారక ఉపన్యాసానికి ఇంగ్లాండ్కు చెందిన కెవిన్ పీటర్సన్ను ఎంపిక చేయడాన్ని బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి తీవ్రంగా విమర్శించాడు.
అతడి ఎంపికను ప్రశ్నిస్తూ అమితాబ్ చౌధురి ప్రశ్నిస్తూ క్రికెట్ పాలక మండలి (సీఓఏ)కు లేఖ రాశారు. అతడి ఎంపికలో కీలక పాత్ర పోషించిన క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ సబా కరీం తీరును కూడా ఆయన తప్పుబట్టారు. భారత దిగ్గజ క్రికెటర్ గురించి విదేశీ ఆటగాళ్లతో ఉపన్యాసం ఏంటని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
'కొద్ది రోజుల కిందట ఈ విషయమై బెంగళూరులో బీసీసీఐ జీఎం (ఆపరేషన్స్) సబా కరీమ్ నాతో చర్చించినప్పుడు.. పటౌడీ సమకాలీకులు ఎర్రాపల్లి ప్రసన్న, అబ్బాస్ అలీ బేగ్, నారీ కాంట్రాక్టర్ పేర్లను నేను సూచించాను. వారైతే.. సవాళ్లను ఎదుర్కొని క్రికెట్ ఎలా పురోగమించిందో నేటి తరానికి తెలియజేసేవారు' అని ప్రశ్నించారు.
'ఉపన్యాసం కోసం కుదించిన జాబితా (గంగూలీ, సంగక్కర, నాసర్ హుసేన్, పీటర్సన్)లో 75 శాతం విదేశీయుల పేర్లే ఉన్నాయి. అసలు ఎందుకు అలా చేశారు? నా సూచనలను కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. బోర్డు పాలకుల కమిటీకి చేరవేయలేదు. కెవిన్ పీటర్సన్ పేరును ఏకపక్షంగా నిర్ణయించారు' అని అమితాబ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
జూన్ 12న బీసీసీఐ అవార్డుల కార్యక్రమం సందర్భంగా కెవిన్ పీటర్సన్ పటౌడీ లెక్చర్లో ప్రసంగించనున్నాడు.