హైదరాబాద్: భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ మళ్లీ క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)లోకి రానున్నారు. శనివారం ఏర్పాటు చేయనున్న ఈ కమిటీలో వీళ్లను తిరిగి నియమించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీంతో సచిన్, వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి ఇందులో సభ్యులుగా పునరాగమనం చేయనున్నారు.
గతంలో సచిన్, లక్ష్మణ్తో పాటు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా సీఏసీ సభ్యులుగా ఉన్నారు. అయితే, పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కారణంగా ఈ ఏడాది జూలైలో వీరు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే గంగూలీ బోర్డు అధ్యక్షుడైన నేపథ్యంలో సీఏసీ మళ్లీ సిద్ధమవుతోంది.
భారత పేసర్ల విజయ రహస్యం వెల్లడించిన బౌలింగ్ కోచ్
తాజాగా సచిన్, లక్ష్మణ్ను మళ్లీ సీఏసీలోకి తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. "శనివారం అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఏసీని ఏర్పాటు చేస్తారు. సీఏసీ సెలక్షన్ కమిటీపై నిర్ణయం తీసుకుంటుంది" అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. ఆదివారం జరిగే బీసీసీఐ ఏజీఎంలో కొత్త సెలక్షన్ కమిటీని కూడా ప్రకటించనున్నారు.