ఆగస్ట్ నుంచి ట్రైనింగ్ క్యాంప్..
అలాగే క్రికెటర్ల శిక్షణ శిబిరాన్ని కూడా అక్కడే నిర్వహించనున్నారు. ఆగస్ట్ మూడో వారం నుంచి సెప్టెంబర్ రెండో వారం మధ్యలో దుబాయ్ వేదికగా 4 నుంచి 6 వారాల పాటు ఈ ట్రైనింగ్ క్యాంప్ ఉండనుంది. 30, 35 మంది టాప్ క్రికెటర్లు ఇందులో పాల్గొంటారు. క్యాంప్ ముగిసిన వెంటనే ప్లేయర్లందరూ తమ ఫ్రాంచైజీలతో చేరుతారు.
సెప్టెంబర్లో ఐపీఎల్..
ఫ్రాంచైజీలు సిద్ధమైన తర్వాత సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8 వరకు ఐపీఎల్ షెడ్యూల్ ఉండే చాన్స్ ఉంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే.. ఆసీస్ టూర్కు ఎంపికైన క్రికెటర్లు దుబాయ్ నుంచి నేరుగా అక్కడికి వెళ్లిపోతారు. మిగతా వారు భారత్కు తిరిగి వచ్చేస్తారు. అయితే బీసీసీఐ ప్లాన్స్ సక్సెస్ కావాలంటే ముందు టీ20 వరల్డ్కప్ వాయిదా లేదా రద్దు కావాలి. దీనిపై ఐసీసీ స్పష్టత ఇచ్చే దాకా ఐపీఎల్పై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయకూడదు. ఒకవేళ చేస్తే అది రూల్స్ను అతిక్రమించడం అవుతుంది.
శుక్రవారం భేటీ..
కాబట్టి ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఫ్రాంచైజీలతో కూడా చర్చించలేదు. శుక్రవారం జరగబోయే కౌన్సిల్ మీటింగ్లో ఈ ప్లాన్పై చర్చ జరుగుతుందని సమాచారం. టీమిండియా భవిష్య పర్యటన ప్రణాళిక గురించి ప్రధానంగా చర్చించనున్నారు. వరల్డ్వైడ్గా ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే టీ20 వరల్డ్కప్ రద్దు కావడం ఖాయం.. యూఏఈలో ఐపీఎల్ జరగడం కూడా అంతే ఖాయంగా కనిపిస్తున్నది.
ముంబైలో నిర్వహించాలనుకున్నా..
నిజానికి ఐపీఎల్ను ముంబయిలో నిర్వహించాలన్నది బీసీసీఐ ఉద్దేశం. కానీ అక్కడ పరిస్థితులు మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదు. కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రయాణాలు, రవాణా, లాజిస్టిక్స్కు ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే దుబాయ్ అత్యుత్తమమని భావిస్తున్నారు. శ్రీలంక, న్యూజిలాండ్ వంటి దేశాల నుంచి ప్రతిపాదనలు వస్తున్నా గత అనుభవాల దృష్ట్యా యూఏఈ వైపే మొగ్గు చూపుతున్నారు.