ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు మరో కీలక ద్వైపాక్షిక సిరీస్ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్లో జరుగనున్న ఇంగ్లండ్ పర్యటన వాయిదా పడనున్నట్లు సమాచారం తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్-అక్టోబర్లో ఇంగ్లండ్ జట్టు భారత్లో పర్యటించాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ కారణంగా భారత్-ఇంగ్లండ్ పర్యటన వాయిదా దాదాపు ఖరారైంది. 2020-21 సీజన్లో సొంతగడ్డపై టీమిండియాకు ఇదే తొలి సిరీస్ కావడం గమనార్హం.
సిరీస్లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు జరగాల్సి ఉన్నది. భారత్లో కరోనా అదుపులోకి రాకపోగా.. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతుండడంతో సిరీస్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 'భారత్-ఇంగ్లండ్ పర్యటన నిస్సందేహంగా వాయిదా పడుతుంది. ఇలాంటి వాతావరణంలో సిరీస్ నిర్వహించడానికి అవకాశం ఎక్కడ ఉంది. తిరిగి సిరీస్ షెడ్యూల్ చేయవలసి ఉంటుంది' అని బీసీసీఐకి చెందిన ఓ ఇన్సైడ్ స్పోర్ట్ అధికారి తెలిపారు.
భారత్లో ఇప్పుడున్న స్థితిలో మ్యాచ్లు నిర్వహించడం అసాధ్యం అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఈనెల 17న జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ సిరీస్పై ఓ నిర్ణయం తీసుకుంటారని ఆ అధికారి తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్ జట్టు 5 మ్యాచ్ల టెస్టు సిరీస్కు భారత్కు రావాల్సి ఉంది. ఇప్పుడు జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్లను టెస్టు సిరీస్ (జనవరి-ఫిబ్రవరి 2021) సమయంలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నది. 2021 జూలైలో కోహ్లీసేన ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ టూర్కు వెళ్లాల్సి ఉంది.
కరోనా వైరస్ కారణంగా భారత క్రికెట్ జట్టు ఇప్పటికే రెండు పర్యటనలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో జింబాబ్వేతో కోహ్లీసేన మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జింబాబ్వే పర్యటన కూడా బీసీసీఐ ఇటీవలే రద్దు చేసింది. అంతకుముందు శ్రీలంక టూర్ను కూడా రద్దు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం టీమిండియా శ్రీలంకకు జూన్ 24న ప్రయాణించాల్సి ఉంది. జింబాబ్వేతో ఆగస్టు 22న మూడు వన్డేల సిరీస్ ఆరంభం కావాల్సి ఉంది.
'ధోనీ నుంచి రోహిత్ కెప్టెన్సీ నేర్చుకున్నాడు.. సారథ్యంలో ఇద్దరూ ఒక్కటే'