హైదరాబాద్: ఇన్నాళ్లు మీటూ ఉద్యమం ఫలితంగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాహుల్ జోహ్రీకి గొప్ప ఉపశమనం లభించింది. ఆ ఉద్యమంలో భాగంగా అక్టోబరు నెలలో ఇద్దరు మహిళలు గతంలో తమని రాహుల్ జోహ్రీ లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు గుప్పించారు. దీనికి స్పందించిన సుప్రీంకోర్టు నియమిత బీసీసీఐ పాలకుల కమిటీ.. రాహుల్ జోహ్రీని సెలవుపై వెళ్లాలంటూ ఆదేశాలు పంపింది.
అప్పటి వరకూ ఎటువంటి అధికారిక సమావేశాలలోనూ పాల్గొనకూడదని నిషేదాజ్ఞలు జారీ చేసింది. న్యాయ విచారణ కోసం ఓ ప్రత్యేక కమిటీని నియమించింది. దీంతో దాదాపు 3 వారాలపాటు విచారణ జరిపిన కమిటీ రాహుల్ జోహ్రీపై వచ్చిన ఆరోపణలు కొట్టివేసింది. పాలకుల కమిటీకి తాజాగా నివేదిక సమర్పించింది. ఈ క్రమంలో రాహుల్ జోహ్రి.. ఇన్ని రోజుల విరామం తర్వాత మళ్లీ తిరిగి విధులకి హాజరుకానున్నాడు.
బీసీసీఐ సీఈవోగా 2016లో బాధ్యతలు చేపట్టిన రాహుల్ జోహ్రీ.. అంతకుముందు డిస్కవరీ నెట్వర్క్స్లో ఉన్నత హోదా ఉద్యోగిగా పని చేసేవాడు. అదే సమయంలో తనకి ఉద్యోగం ఇప్పిస్తానని రాహుల్ జోహ్రీ మభ్యపెట్టినట్లు 'మీటూ' ఉద్యమంలో భాగంగా తొలుత ఓ మహిళా జర్నలిస్ట్ సోషల్ మీడియాలో ఆరోపించింది. ఆమెకు మద్ధతుగా మరొకరు ఆరోపణలు చేయడంతో బీసీసీఐ పాలకుల కమిటీ రంగంలోకి దిగింది.
ఆరోపణలపై 14 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని జోహ్రీని బీసీసీఐ పాలకుల కమిటీ ఆదేశించింది. వెంటనే అతను వాటిని ఖండిస్తూ వివరణ ఇచ్చాడు. కానీ ఆ మరుసటి రోజే.. రెండో మహిళా జర్నలిస్ట్ రాహుల్ జోహ్రీపై లైంగిక ఆరోపణలు చేసింది. ఇక అతడ్ని లీవ్పై పంపిన కమిటీ ప్రత్యేకంగా ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించి.. విచారణను ముగించింది.