
హైదరాబాద్: హసిన్ జహాన్ పేరు పరిచయం చేయాల్సిన అవసర్లేకుండా పోయింది. అంతటి స్థాయిలో షమీపై ఆరోపణలు చేస్తూ మీడియాలో హల్చల్ చేస్తోంది. కానీ, అవన్నీ అబద్దాలంటూ కొట్టి పరేస్తున్నాడు టీమిండియా ఫేసర్ షమీ. శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్న షమీ బీసీసీఐ విచారణ గురించి ఇలా అన్నాడు.
తాను ఎప్పుడూ ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ల్లోనూ పాల్గొనలేదని.. తనకు బీసీసీఐ ఎప్పుడూ మద్దతుగా నిలిచిందని పేర్కొన్నాడు. అన్ని అంశాలను పరిశీలించి, ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరాడు.
'నేను బీసీసీఐ నుంచి ఆశిస్తున్నది ఒకటే.. ఓ పాకిస్థానీ అమ్మాయి వద్ద నుంచి డబ్బులు తీసుకోవడం.. దుబాయి వెళ్లిన ఘటనలను రెండింటినీ తప్పుగా కలిపి చూపిస్తున్నారు. నేనెప్పుడూ తప్పు చేయలేదు. భవిష్యత్తులో చేయను కూడా. ఇదంతా నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి చేస్తున్న ప్లాన్. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరగాలని కోరుకుంటున్నా.' అని షమి చెప్పుకొచ్చాడు.
ఓ పాకిస్థానీ అమ్మాయి నుంచి షమి డబ్బుల తీసుకున్నాడని అతడి భార్య ఆరోపించిన నేపథ్యంలో సీఓఏ అధినేత వినోద్ రాయ్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఏసీయూ అధినేత నీరజ్ కుమార్ విచారణ జరుపుతున్నారు. అతడి నివేదిక అందాక దాన్ని బట్టి షమిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇప్పటికే బీసీసీఐ షమి సెంట్రల్ కాంట్రాక్టును నిలిపి ఉంచింది. అతడు తప్పు చేయలేదని తేలితే వెంటనే కాంట్రాక్టు ఇస్తామని బీసీసీఐ అధికారి ఒకరు ఇప్పటికే స్పష్టం చేశారు.
ఈ విషయంపై స్పందించిన 'ఇది ప్రజల్లోకి వెళ్లిన కుటుంబ వ్యవహారం. నా జట్టు సహచరులందరికీ నేనేంటో తెలుసు. గతంలో వారు నాకు చాలా మద్దతుగా నిలిచారు. భవిష్యత్తులోనూ కొనసాగుతుందని భావిస్తున్నా. నేను కొందరు జట్టు సభ్యులతో మాట్లాడాను. మరికొందరు నాకు బహిరంగంగానే మద్దతు తెలిపారు. అన్ని కుటుంబాల్లోనూ ఏదో ఒక సమస్య ఉంటుంది. కానీ, అవి పరిమితులు దాటి బయటికిరావు. నా కుమార్తెకు ఎంతో జీవితం ముందుంది. ఆమె భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. దాని కోసం చేయాల్సిందంతా చేస్తాను.' అంటూ వివరించాడు.