
ముంబై: ఇంగ్లండ్తో చివరి రెండు టెస్ట్లకు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఒక్క మార్పు మినహా తొలి రెండు టెస్ట్లకు ఉన్న జట్టునే కొనసాగించింది. గాయం నుంచి కోలుకున్న ఉమేశ్ యాదవ్ జట్టులోకి రాగా.. టీమ్లో ఉన్న యువ పేసర్ శార్దూల్ ఠాకూర్ను విజయ్ హజారే ట్రోఫీ కోసం విడుదల చేసింది. ఫిట్నెస్ టెస్టు అనంతరం ఉమేశ్ యాదవ్ జట్టుతో కలుస్తాడని బీసీసీఐ స్పష్టం చేసింది.
ఇక ఉమేశ్ యాదవ్ వస్తాడని ఊహించినా.. అతను ఇంకా పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించలేదు. టీమిండియా సెలెక్షన్ కమిటీ ఇద్దరు స్టాండ్ బై ఆటగాళ్లతో పాటు ఐదుగురిని నెట్ బౌలర్స్గా కూడా ఎంపిక చేసింది. కేఎస్ భరత్, రాహుల్ చాహర్ స్టాండ్బై ఆటగాళ్లుగా ఉండగా.. అంకిత్ రాజ్పుత్, అవేశ్ ఖాన్, సందీప్ వారియర్, కృష్ణప్ప గౌతమ్, సౌరభ్ కుమార్లను నెట్ బౌలర్స్గా తీసుకున్నారు.
ఇప్పటి వరకు జట్టుతో ఉన్న అభిమన్యు ఈశ్వరన్, షెభాజ్ నదీమ్, ప్రియాంక్ పాంచల్లను విజయ్ హజారే ట్రోఫి కోసం విడుదల చేసింది. అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 24-28 వరకు మూడో టెస్ట్(డై/నైట్) జరగనుండగా.. ఇదే వేదికపై మార్చి 4 నుంచి 8 వరకు చివరి టెస్ట్ జరగనుంది. చెన్నై వేదికగా ఫస్ట్ టెస్ట్ చిత్తుగా ఓడి.. రెండో టెస్ట్లో భారీ విజయం సాధించిన భారత్ నాలుగు టెస్ట్ల సిరీస్లో 1-1తో సమంగా ఉంది. చివరి రెండు టెస్ట్ల్లో కూడా గెలిచి సగర్వంగా టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలని భావిస్తోంది.
భారత జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె, రిషభ్ పంత్, వృద్దీమాన్ సాహా, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ఉమేశ్ యాదవ్.
స్టాండ్ బై: కేఎస్ భరత్, రాహుల్ చాహర్
నెట్ బౌలర్లు: అంకిత్ రాజ్పుత్, అవేశ్ ఖాన్, సందీప్ వారియర్, కృష్ణప్ప గౌతమ్, సౌరభ్ కుమార్