హైదరాబాద్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఢాకా ప్రిమియర్ లీగ్లో ఆడే క్రికెటర్ నజ్రీన్ ఖాన్ ముక్తా ఆదివారం కాక్స్ బజార్ సిటీలో ఓ మ్యాచ్ ఆడి జట్టు సభ్యులతో బస్సులో తిరిగివస్తోంది. స్థానిక పోలీసులు ఆ వాహనాన్ని చిట్టగాంగ్ వద్ద ఆపి తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో నజ్రీన్ వద్ద 14 వేల నిషేధిత మెథామ్ఫెటామైన్(యాబా) మాత్రలు లభ్యమయ్యాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కింద ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అరెస్టయితే నిందితులకు గరిష్ఠంగా జీవితఖైదు పడే అవకాశం ఉంది. మెథామ్ఫెటామైన్, కెఫైన్ మిశ్రమం కలిగిన ఈ ట్యాబ్లెట్లు తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తాయి.
మయన్మార్కు సరిహద్దుల్లో కాక్స్ బజార్ నగరం ఉంది. మయన్మార్లో రఖీన్ రాష్ట్రం నుంచి భారీ ఎత్తున యాబా మాత్రలు బంగ్లాదేశ్కు అక్రమ రవాణా అవుతుంటాయి. ఇటీవల రోహింగ్య శరణార్థులు మయన్మార్ నుంచి బంగ్లాదేశ్కు తరలిరావడంతో ఈ అక్రమ రవాణా మరింత పెరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. గత ఏడాది 40 మిలియన్ల యాబా మాత్రలను బంగ్లాదేశ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు శిక్షలు కఠినం చేసి మరణశిక్ష విధించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ.. తనిఖీ నిర్వహిస్తుండగా ఆమె వద్ద నుంచి 14000 యాబా పిల్స్ గుర్తించాం. వాటిని పాకెట్ల రూపంలో తన వద్ద దాచి ఉంచింది.' అని పేర్కొన్నారు. మయన్మార్ సరిహద్దు ప్రాంతంలోని ఘటనాస్థలానికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఛీప్ ప్రణబ్ చౌదరీ మీడియాకు వెల్లడించారు. 2017వ సంవత్సరంలోనే ఇటువంటి 40మిలియన్ ట్యాబ్లెట్లను నిషేదించింది.