కరాచి: ఇప్పటికే టెస్టు, టీ20ల్లో కెప్టెన్సీ కోల్పోయిన పాకిస్థాన్ వన్డే కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్కు మరో షాక్ తగలనుంది. గత రెండేళ్లుగా అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్ బెస్ట్ బ్యాట్స్మన్, టీ20 కెప్టెన్ అయిన బాబర్ అజామ్కు వన్డే కెప్టెన్ బాధ్యతలను పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అప్పగిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఏప్రిల్లో బంగ్లాదేశ్తో జరిగే ఏకైక వన్డేకు బాబర్ కెప్టెన్ బాధ్యతలు అందుకునే అవకాశం ఉంది. ఇదే నిజమయితే మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ నుండి సర్ఫరాజ్ తొలగించబడతాడు.
వైరల్ న్యూస్.. టీమిండియా క్రికెటర్తో అనుష్క శెట్టి పెళ్లి?!!
ఇటీవలే శ్రీలంక చేతిలో స్వదేశంలో టీ20 సిరీస్ కోల్పోయిన కారణంగానే సర్ఫరాజ్ అహ్మద్పై వేటు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ 2019లో టీమిండియా చేతిలో పాక్ ఓడిపోవడంతో.. నాకౌట్ దశలకు అర్హత సాధించడంలో విఫలమైన కారణంగా సర్ఫరాజ్పై వేటు పడింది. ప్రస్తుతం పాక్ క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు. టెస్టుల్లో అజార్ అలీ, వన్డేల్లో సర్ఫరాజ్, టీ20లకు బాబర్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అయితే సర్ఫరాజ్ అహ్మద్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం సరైనది కాదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన సర్ఫరాజ్.. టెస్టు, టీ20 జట్టులో ఇప్పటికే చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్నో ఏళ్లుగా పాక్కు బ్యాట్స్మన్, కీపర్, కెప్టెన్గా సేవలందిస్తున్న అతడిని వన్డేల్లో సారథిగా కొనసాగించాలని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇక మూడు ఫార్మాట్లలో బ్యాటింగ్లో రాణిస్తున్న బాబర్ అజామ్కే అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని పాక్ మాజీ క్రికెటర్ రమిజ్ రాజా అంటున్నాడు.
ఏప్రిల్ 2016న సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్థాన్ జట్టు టీ20 కెప్టెన్గా నియమింపబడ్డాడు. ఆ తర్వాత 2017లో వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. 2017లో వెస్టిండిస్ పర్యటనలో పాకిస్థాన్ జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించడంతో.. ఆ తర్వాత మూడు ఫార్మాట్లకు అతడినే కెప్టెన్గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్థాన్ జట్టు తరఫున 49 టెస్టులు, 116 వన్డేలు, 58 టీ20లు ఆడాడు.