హైదరాబాద్: ఆసీస్ వన్డే జట్టుకు చెందిన ఇటగాళ్లు సంతకాలు చేసిన రెండు బ్యాట్లను ఇండియా విజన్ ఇన్స్టిట్యూట్(ఐవీఐ) అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చారు. ఈ సంస్ధ దృష్టి లోపం ఉన్న చిన్నారులకు శస్త్రచికిత్స కోసం విరాళాలు సేకరిస్తోంది.
తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా పేద చిన్నారులకు శస్త్రచికిత్స ద్వారా చూపును అందించాలన్న లక్ష్యంతో ఈ సంస్థ పని చేస్తోంది. ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ సీన్ కెల్లీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంతాకాలు చేసి ఇచ్చిన రెండు బ్యాట్లను ఇండియా విజన్ ఇన్స్టిట్యూట్(ఐవీఐ) సంస్ధ సీఈఓ వినోద్ డానియల్కి అందించారు.

ఈ సందర్భంగా డానియేల్ మీడియాతో మాట్లాడారు. 'ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, జట్టు ఆటగాళ్లకు ధన్యవాదాలు. భారత్తో సిరీస్లో ఆసీస్ మెరుగైన ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నా. ఈ రెండు బ్యాట్లకు త్వరలో వేలం నిర్వహిస్తాం. అభిమాన ఆటగాళ్ల బ్యాట్లను దక్కించుకోవడానికి క్రికెట్ అభిమానులకు ఇదో మంచి అవకాశం' అని అన్నారు.
సీన్ కెల్లీ మాట్లాడుతూ 'ఓ మంచి పని కోసం ఆసీస్ క్రికెటర్ల సంతకాలతో కూడిన బ్యాట్లను అందజేయడం సంతోషంగా ఉంది. ఇంతటి మంచి పనికి సాయం చేసేందుకు ముందుకొచ్చిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ధన్యవాదాలు' అని తెలిపాడు. ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం ఆసీస్ క్రికెట్ జట్టు ప్రస్తుతం భారత్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.