మెల్బోర్న్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020కి భారత కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 19న ఆరంభమయ్యే మెగా టోర్నీ నవంబరు 10న ముగుస్తుంది. ఇంతకుముందు ఐపీఎల్ను కరోనా మహమ్మారి కారణంగా నిరవధికంగా వాయిదా వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. ఈఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా నేపథ్యంలో టోర్నీని యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్కు ఎలాంటి అంతరాయం కలగకుండా అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ జరుగనుండగా.. అదే సమయంలో నిర్వహించాలనుకున్న సిరీస్ల వాయిదా అనివార్యమవుతుంది. ఇందులో భాగంగా వెస్టిండీస్తో ప్రతిపాదిత టీ20 సిరీస్ను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వాయిదా వేసింది. రెండు బోర్డుల మధ్య చర్చల అనంతరం మంగళవారం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. టీ20 ప్రపంచకప్కు సన్నాహకంగా అక్టోబరు 4, 6, 9 తేదీల్లో 3 మ్యాచ్ల పొట్టి సిరీస్ను నిర్వహించాలని ఇరు బోర్డులు తొలుత భావించాయి.
వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచకప్ వాయిదా పడటంతో టీ20 సిరీస్తో పెద్దగా ప్రయోజనం లేదని అంచనాకు వచ్చిన వెస్టిండీస్, ఆస్ట్రేలియా బోర్డులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నాయి. అయితే ఐపీఎల్కు ఇబ్బంది కలగకూడదన్నదే అసలు కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అక్టోబరులో ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరగాల్సిన టీ20 సిరీస్ కూడా వాయిదా పడటం లాంఛనమే అయింది. అక్టోబరు 11, 14, 17 తేదీల్లో ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్ల సిరీస్ ఆడాలని భారత్ భావించింది. అయితే సెప్టెంబరు-నవంబరులో ఐపీఎల్ ఉండటంతో ఆసీస్తో టీ20 సిరీస్ వాయిదా అనివార్యం కానుంది.
డిసెంబరు-జనవరిలో ఆస్ట్రేలియాతో భారత్ టెస్టు, వన్డే సిరీస్ల అనంతరం టీ20లు ఆడే అవకాశముందని సమాచారం. సెప్టెంబరు 20న ముగియాల్సిన శ్రీలంక ప్రిమియర్ లీగ్ను కూడా ఐపీఎల్ కోసం కాస్త ముందుకు జరిపేందుకు ఆ దేశ బోర్డు కసరత్తులు చేస్తోందట. శ్రీలంక నుంచి లసిత్ మలింగ (ముంబై), ఇసురు ఉదానా (బెంగళూరు) ఐపీఎల్లో బరిలో దిగుతున్నారు. వైరస్ కారణంగా ఇప్పటికే పలు సిరీస్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. శ్రీలంక, జింబాబ్వే పర్యటలను భారత్ రద్దు చేసుకుంది.
నేటి నుంచే తొలి టెస్టు.. ఇంగ్లండ్ జోరు కొనసాగేనా?.. సత్తాచాటేందుకు పాక్ సిద్ధం!!