
హైదరాబాద్: బ్రిస్బేన్ వేదికగా బుధవారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు టీ20ల సిరిస్ల మరో మ్యాచ్ మిగిలుండగానే సిరిస్ను కైవసం చేసుకుంది. ఈ సిరిస్లో చివరిదైన మూడో టీ20 మెల్ బోర్నీ వేదికగా శుక్రవారం జరగనుంది.
118 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వార్నర్(60 నాటౌట్), స్మిత్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో మరో 42 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాను మలింగ ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బకొట్టాడు.
ఓపెనర్ ఆరోన్ ఫించ్ డకౌట్గా పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్తో కలిసి వార్నర్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక జట్టులో బ్యాట్స్మెన్ కుశాల్ పెరెరా (27), దనుష్క (21) మాత్రమే రెండంకెల స్కోరుని అందుకోగా మిగతా బ్యాట్స్మన్ పూర్తిగా నిరాశపరిచారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో బిల్లీ స్టాన్ లేక్, ప్యాట్ కమిన్స్, ఆస్టన్ ఆగర్, ఆడమ్ జంపా తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ సిరిస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 134 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి టీ20లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.