ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ నెట్ బౌలర్ జే కిషన్ ప్లాహాకు సారీ చెప్పాడు. ప్రపంచకప్లో భాగంగా లండన్లోని ఓవల్ మైదానం వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు ముందు ఓవల్లో నెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఆసీస్ క్రికెటర్లకు 23 ఏళ్ల జే కిషన్ ప్లాహా అనే భారత సంతతికి చెందిన ఇంగ్లండ్ బౌలర్ బౌలింగ్ చేసాడు. ఓ బంతిని వార్నర్ బలంగా బాదడంతో అది ప్లాహాకు తగిలింది. దీంతో కిషన్ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్ట్రేలియా ఫిజీషియన్స్, డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి ప్లాహను ఆస్పత్రికి తరలించారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మెరుగైన చికిత్స అనంతరం జే కిషన్ ప్లాహా కోలుకున్నాడు. తాజాగా వార్నర్.. ప్లాహాను కలిసి ఆలింగనం చేసుకుని సారీ చెప్పాడు. అంతేకాదు ఆసీస్ ఆటగాళ్లు అందరూ ఆటోగ్రాఫ్స్ చేసిన టీం జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. వార్నర్ స్పందించిన తీరుకు ఆసీస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ఓ మ్యాచ్లో తనకు లభించిన 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'ను చిన్నారి ఫ్యాన్కు ఇచ్చి వార్నర్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు.
ప్లాహా మాట్లాడుతూ... 'ఆసుపత్రిలో ఉన్న నన్ను చూడడానికి ఆసీస్ ఆటగాళ్లు వచ్చారు. వార్నర్ సారీ చెప్పి ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు. ఆసీస్ ఆటగాళ్లంతా ఆటోగ్రాఫ్స్ చేసిన టీం జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. తన కుటుంబ సభ్యులతో ప్రపంచకప్ మ్యాచ్లు చూడటానికి టికెట్లు కూడా ఇచ్చారు. ఈ ఘటనను జీవితంలో మరిచిపోలేను' అని ప్లాహా తెలిపారు.
ప్రపంచకప్లో భాగంగా బంగ్లాతో జరిగిన మ్యాచ్లో ఆసీస్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 382 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 333 పరుగులే చేసింది. బంగ్లా ముష్పీకర్ రహీమ్ (102 నాటౌట్; 97 బంతుల్లో 9 ఫోర్లు, 1సిక్సర్)సెంచరీతో పోరాడినా ఫలితం లభించలేదు. అంతకుముందు డేవిడ్ వార్నర్ (166: 147 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్స్లు) సెంచరీతో కదం తొక్కడంతో ఆసీస్ 381 పరుగుల భారీ స్కోర్ చేసింది. వార్నర్కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.