
హైదరాబాద్: ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నీలో ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ చరిత్ర సృష్టించాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం ససెక్స్-సర్రే జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తనకు ఒక పరుగు వద్ద లభించిన లైఫ్తో చెలరేగాడు.
మొత్తం 79 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 131 పరుగులు బాది అరుదైన రికార్డు నెలకొల్పాడు. సర్రే జట్టు తరపున బరిలోకి దిగిన ఆరోన్ ఫించ్.. సస్సెక్స్ బౌలర్లకు చుక్కులు చూపించాడు. దీంతో సర్రే జట్టు 52 పరుగుల తేడాతో సస్సెక్స్పై విజయం సాధించింది.
ఆరోన్ ఫించ్ ఒక పరుగు వద్ద ఉన్నప్పుడు జోఫ్రా ఆర్చర్కు రిటర్న్ క్యాచ్ ఇవ్వగా దానిని అందుకోవడంలో అతడు విఫలమయ్యాడు. ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకున్న ఫించ్ 131 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ స్కోరు సర్రే జట్టు బ్యాట్స్మన్గా అత్యధిక స్కోర్ కాగా ఫించ్కు టీ20ల్లో ఐదో సెంచరీ.
టీ20ల్లో నంబర్వన్ బౌలర్గా కొనసాగుతున్న ఆప్ఘన్ యువ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా ఈ మ్యాచ్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఫించ్ దెబ్బకు రషీద్ ఖాన్ 40 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో సర్రే జట్టు మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ససెక్స్ జట్టు ఆరంభంలోనే తడబడింది. 18వ ఓవర్లోనే 140 పరుగులకే ఆలౌటైంది.