బంగ్లా, శ్రీలంక జట్లకు ఆఫ్ఘన్కు తేడా అదే
'ఇక గ్రూప్ స్టేజులో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు చేసిన పొరపాట్లు.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు చేయలేదు. నో బాల్స్ గురించి మాట్లాడినా, ఎక్స్ ట్రా పరుగుల విషయం గురించి మాట్లాడినా.. ఆఫ్ఘనిస్థాన్ తప్పులు చేయకుండా పోటీ క్రికెట్ ఆడడాన్ని మీరు చూసే ఉంటారు. ఎంత గొప్ప జట్టు అయినప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్ను ఓడించడానికి అత్యుత్తమ క్రికెట్ ఆడాల్సిందే.. ఏమాత్రం తేలికగా తీసుకున్నా జరగాల్సిన నష్టం భారీగా ఉంటుంది' అని నిఖిల్ చోప్రా క్రిక్ట్రాకర్లో 'రన్ కి రన్నీతి'లో పేర్కొన్నాడు.
సెప్టెంబర్ 6న ఇండియాతో ఆఫ్ఘన్
ఆసియా కప్ టోర్నీ 2022లో సూపర్ ఫోర్కు ఆఫ్ఘన్ అర్హత సాధించడంతో శ్రీలంక వర్సెస్ బంగ్లా దేశ్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. తీవ్ర ఉత్కంఠ నడుమ శ్రీలంక గెలుపొందడంతో బంగ్లాదేశ్ ఆసియా కప్ టోర్నీ నుంచి గ్రూప్ స్టేజులోనే నిష్క్రమించింది. శ్రీలంక బంగ్లాపై రెండు వికెట్ల తేడాతో గెలిచి సూపర్ ఫోర్ స్టేజుకు అర్హత సాధించింది. సెప్టెంబరు 3న ఆఫ్ఘనిస్థాన్ శ్రీలంకతో తలపడనుంది. అలాగే సెప్టెంబర్ 6న భారత్కు సవాల్ విసరనుంది. సెప్టెంబర్ 9న నేటి పాకిస్థాన్ వర్సెస్ హాంకాంగ్ మ్యాచ్ విజేతతో ఆఫ్ఘన్ తలపడనుంది.
బంగ్లాదేశ్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన టైం
బంగ్లాదేశ్ ప్రదర్శన గురించి మాజీ క్రికెటర్ విజయ్ దహియా మాట్లాడుతూ..'బంగ్లా ఇప్పటికైనా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. జట్టు వరుసగా అపజయాల బాట పడుతుంటే.. జట్టును మార్చాల్సిందే. మొసద్దెక్ హొస్సేన్ ఈ రాత్రి బాగా ఆడాడు. అతను 22ఏళ్ల వయసులో జట్టుకు వైస్-కెప్టెన్ అయ్యాడు. అలాంటి కీలక నిర్ణయాలు మరిన్నీ జరగాలి. మార్పు తీసుకురావడానికి ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. తప్పకుండా బంగ్లాలో నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారు. కానీ ఆ జట్టు చేసే పొరపాట్లే జట్టును భారీగా దెబ్బతీస్తుంది. ఏదేమైనా బంగ్లా రెండు ఉత్కంఠకర మ్యాచ్లను మనకు అందించింది.' అని విజయ్ దహియా పేర్కొన్నాడు.