హైదరాబాద్: మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తున్న టీమిండియాకు ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. దీంతో ఎప్పటికప్పుడు టీమిండియాలో నాలుగో స్థానం బ్యాట్స్మన్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాడు. సెప్టెంబర్ 18నుంచి భారత్ ఆసియా కప్లో ఆడనుంది. తొలి మ్యాచ్ను పసికూన హాంకాంగ్తో ఆడినా రెండో మ్యాచ్ను మాత్రం ప్రధాన ప్రత్యర్థి పాకిస్థాన్తో పోరుకు సిద్దమైంది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ వస్తేనే బాగుంటుందని భారత జట్టు మాజీ ఫేసర్ జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు.
జహీర్ అంచనా ప్రకారం.. నాలుగో స్థానంలో దిగేందుకు 1ధోనీ పర్ఫెక్ట్ బ్యాట్స్మన్ అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. జట్టు మిడిల్ ఆర్డర్లో రాణించేందుకు ఇది బాగా తోడ్పడుతుందని చెప్పుకొచ్చాడు. గతంలో ఈ స్థానంలో బ్యాటింగ్కు దిగిన సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్లు కీలకంగా వ్యవహరించి జట్టును విజయతీరాలకు చేర్చిన సందర్భాలు గుర్తు చేసుకున్నాడు. దీంతోనే ప్రస్తుతం టీమిండియా అలాంటి బ్యాట్స్మన్ గురించే ఎదురుచూస్తోంది.
'ఒకవేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగేందుకు సిద్ధపడితే అది ధోనీనే కావాలి. ఒకసారి టీమిండియా వైఫల్యాలను పరిశీలిస్తే ఆరంభ మ్యాచ్లలో శుభారంభాలు నమోదైతేనే సిరీస్ను విజయవంతంగా దక్కించుకోగలదు. అలా కాకుండా జట్టు ఆరంభంలోనే తడబడి వైఫల్యాల పాలైతే మళ్లీ కోలుకోవడం కష్టమైన పని. దీనిని బట్టే అర్థమవుతోంది. టీమిండియాకు మంచి అనుభవమున్న బ్యాట్స్మన్ కావాలని.' అందుకే ఆ నాలుగో స్థానంలో ధోనీ అయితేనే సరిగ్గా సరిపోతాడని విశ్వసిస్తున్నానని తెలిపాడు.
ఇదే విషయంపై న్యూజిలాండ్ మాజీ ఆటగాడు సైమన్ డల్ స్పందిస్తూ.. ధోనీ కెరీర్ మొత్తంలో నాలుగో స్థానంలో మంచి విజయాలు పొందగలిగాడు. అతనికి నాలుగో స్థానం చక్కగా నప్పుతుంది. ఇక కేదర్ జాదవ్ను ఐదో స్థానంలో.. దినేశ్ కార్తీక్ను ఆరో స్థానంలో దింపాలి. ధోనీ ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకుంటే అతను మ్యాచ్కు మంచి ముగింపుని ఇవ్వగలడు. కాసేపు సమయమిస్తే జట్టును చక్కదిద్దగల నేర్పరి. స్పిన్ను కూడా చక్కగా ఎదుర్కోగలడు' అని అతను వెల్లడించాడు.