మహమ్మద్ ఆమీర్ Vs రోహిత్ శర్మ/శిఖర్ ధావన్
పాక్ బౌలింగ్లో భారీ ఆశలు పెట్టుకున్న పేసర్ మహమ్మద్ ఆమిర్ వికెట్లు తీయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పునరాగమనం తర్వాత అత్యంత విజయవంతమైన బౌలర్గా పేరు తెచ్చుకున్న ఆమిర్ లండన్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్కు చుక్కలు చూపించాడు. కానీ, చిన్న జట్టుపై వికెట్లు తీయకపోవడంపై భారత్తో మ్యాచ్లో ఆడతాడా? లేదా? అన్నది సందిగ్దంగా మారింది. మరోవైపు టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత తన సత్తా ఏమిటో ఇక్కడి చూపించాలని రోహిత్ పట్టుదలగా ఉన్నాడు. ఫుట్వర్క్ మెరుగ్గా ఉండని రోహిత్ను చక్కటి స్వింగ్తో తొలి రెండు ఓవర్లలోనే వెనక్కి పంపాలని అతను భావిస్తూ ఉండవచ్చు. దీనిని అధిగమించగలిగితే రోహిత్ను అడ్డుకోవడం చాలా కష్టం. ఇక, హాంకాంగ్తో జరిగిన తొలి మ్యాచ్లో సెంచరీ చేసిన శిఖర్ ధావన్ మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. అయితే, ఆమీర్ బౌలింగ్లో ఎలా ఆడతాన్నది ఆసక్తిగా మారింది.
జస్ప్రీత్ బుమ్రా Vs ఫకార్ జమాన్
గతేడాది ఓవల్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఫకార్ జమాన్ను జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేశాడు. అయితే, ఆ బంతి నోబాల్ కావడం, అతడికి లైఫ్ రావడంతో సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాతి నుంచి ఈ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. టెస్టు క్రికెట్లో సైతం బుమ్రా భారత ప్రీమయం పేసర్గా కొనసాగుతున్నాడు. పాక్ తరుపున డబుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్మన్గా ఫకార జమాన్ చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది జులై 10న జింబాబ్వేతో హారారే క్రికెట్ క్లబ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఫకార్ జమాన్ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య పోరు మరింత ఆసక్తికరం కానుంది.
భువనేశ్వర్ కుమార్ Vs బాబర్ ఆజాం
ఈ మధ్య కాలంలో పాకిస్థాన్ విజయాల్లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు బాబర్ అజాం. ప్రస్తుతం పాక్ జట్టు తరుపున అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాళ్లలో బాబర్ ఆజాం చోటు దక్కించుకున్నాడు. మొత్తం 47 మ్యాచ్ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, భువీ విషయానికి వస్తే గాయం కారణంగా ఇంగ్లాండ్ టెస్టు సిరిస్కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో తిరిగి లయను అందుకున్నాడు.
భారత చైనామన్ స్పిన్నర్లు Vs పాకిస్థాన్ బ్యాట్స్మెన్
గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ను ఓడించడం వల్ల మానసికంగా పాకిస్తాన్దే పైచేయి. ఆ మ్యాచ్లో పాక్ ఓపెనర్లు, బౌలర్లు అద్భుత ప్రదర్శనతో భారత్ను చిత్తుగా ఓడించారు. అయితే, 2017లో ఆస్ట్రేలియాతో వన్డే సిరిస్లో అద్భుత ప్రదర్శన అనంతరం భారత్ స్పిన్ దళంలోకి కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహాల్లు చేరారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన వన్డే సిరిస్ల్లో ఈ ఇద్దరూ సూపర్ ఫామ్తో దూసుకుపోతున్నారు. తన 24వ వన్డేలో కుల్దీప్ యాదవ్ 50వ వికెట్ తీసుకోగా.... యజువేంద్ర చాహాల్ 27 మ్యాచ్ల్లో 48 వికెట్లు పడగొట్టాడు. హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో వీరిద్దరూ కలిసి 5 వికెట్లు పడగొట్టారు. దీంతో ప్రతిభ గల పాకిస్తాన్ బ్యాట్స్మెన్కు, భారత స్పిన్నర్లకు మధ్య జరిగే ఆసక్తికర పోరును చూడాల్సిందే.
ఆసియాకప్లో ఇరు జట్ల మధ్య 12 మ్యాచ్లు జరగగా.. ఆరింటిలో భారత్ నెగ్గింది. ఓ మ్యాచ్ రద్దయింది. యూఏఈలో పాక్తో ఆడిన 26 మ్యాచ్ల్లో భారత్ గెలిచింది ఏడుసార్లు మాత్రమే.
ఆసియా కప్: నేడు భారత్ X పాకిస్థాన్
సాయంత్రం 5 గంటలకు మ్యాచ్ ప్రారంభం
జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), ధవన్, రాయుడు, దినేశ్ కార్తీక్, ధోనీ, జాదవ్, పాండ్యా, కుల్దీప్, భువనేశ్వర్, బుమ్రా, చాహల్.
పాకిస్థాన్: ఇమామ్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజమ్, షోయబ్, సర్ఫరాజ్ (కెప్టెన్), అసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఫహీమ్ ఆష్రఫ్, ఆమెర్, హసన్ అలీ, ఉస్మాన్ ఖాన్.