|
కష్టానికి తగ్గ బహుమతి లభించింది:
'టోర్నమెంట్ మొత్తంలో మేం చక్కటి ప్రదర్శన చేశాం. ఇప్పుడు పడిన కష్టానికి తగ్గ బహుమతి లభించినట్లు అయింది. ఇలాంటి జట్టు ఉంటే ఏ కెప్టెన్ అయినా చక్కగానే కనపడతాడు. ఇలా నేను ఇంతకుముందు ఆడిన గేమ్స్లో కూడా అందరిలో ఒకడిలా ఉంటూనే ఆటలో ఒత్తిడి తగ్గించేందుకే ప్రయత్నించేవాడిని.'
తీవ్రమైన ఒత్తిడి పెంచిన బంగ్లా బ్యాట్స్మెన్
' ఆటలో ముగింపునిచ్చేందుకు చాలా కష్టపడేవాడిని. కానీ, ఫైనల్ మ్యాచ్లో మాత్రం బంగ్లా బ్యాట్స్మెన్ మొదటి పది ఓవర్లు తీవ్రమైన ఒత్తిడి పెంచారు.ఒక్క వికెట్ కూడా పడకుండా చక్కటి ఫామ్ను కొనసాగించారు. ఈ విషయంలో వారిని కూడా అభినందించాల్సిందే. దాంతో పాటుగా మా జట్టులో మిగిలిన పది మంది ప్లేయర్ల సహకారంతోనే ఇది సాధించగలిగాం. వారి ప్రదర్శన నాకెంతో గర్వంగా అనిపిస్తోంది.'
260కి మించని స్కోరుతో ముగించాలని చెప్పా
'బౌలర్ల గురించి చెప్పాలంటే మేం వాళ్లని 260కి మించని స్కోరుతో ముగించాలని చెప్పాం. కానీ, వాళ్లు అంతకంటే మెరుగైన ప్రదర్శన చేసి ఇంకా తక్కువ స్కోరుకే ముగించారు. ముందు వాళ్ల పరుగులు కట్టడి చేయాలనే బౌలర్లకు చెప్పా. ఎందుకంటే వారి బాదుడు ఫామ్ అందుకుంటే టార్గెట్ పెరిగిపోతుంది కదా.'
ఫైనల్లో 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై విజయం
టీమ్ఇండియా ఆసియా విజేతగా నిలిచింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. స్పిన్నర్లు కుల్దీప్ యదవ్ (3/45), కేదార్ జాదవ్ (2/41), చాహల్ (1/31) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మొదట భారత్.. బంగ్లాను 48.3 ఓవర్లలో 222 పరుగులకే కట్టడి చేసింది. లక్ష్యాన్ని భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లిటన్ దాస్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా, శిఖర్ ధావన్ ‘మ్యాన్ ఆఫ్ ద టోర్నీ'గా ఎంపికయ్యారు.