
హైదరాబాద్: ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. ఆటలో భాగంగా మూడో రోజైన శుక్రవారం మార్నింగ్ సెషన్ వర్పార్పణం అయింది. మూడో రోజు ఆట ప్రారంభం కాకముందే వరుణుడు అడ్డు తగిలాడు. వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడలేదు.
దీంతో గెలిచే అవకాశాలున్న నాలుగో టెస్టుకు వర్షం అడ్డంకిగా మారడంతో ఆస్ట్రేలియా నిరాశతో ఉంది. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్లో ఇప్పటికే మూడు టెస్టులు పూర్తయ్యాయి. తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా... లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది.
దీంతో సిరిస్ 1-1తో సమం అయింది. ఇరు జట్ల మధ్య బుధవారం ప్రారంభమైన నాలుగో టెస్టులో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్ (211; 319 బంతుల్లో 24 ఫోర్లు, 2 సిక్సులు) డబుల్ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. నిజానికి స్మిత్ 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే ఔట్ కావాల్సింది.
స్టీవ్ స్మిత్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను జోఫ్రా ఆర్చర్ వదిలేశాడు. ఆ క్యాచ్ను గనుక పట్టి ఉంటే మ్యాచ్ వేరేలా ఉండేది. ఆ తర్వాత 82 పరుగుల వద్ద స్మిత్ రనౌట్ ప్రమాదాన్ని కూడా తప్పించుకున్నాడు. సెంచరీ తర్వాత స్మిత్కు మరో లైఫ్ లభించింది. లీచ్ బౌలింగ్లో స్మిత్ స్లిప్లో స్టోక్స్కు దొరికిపోయాడు. అయితే, అది నోబాల్ కావడంతో అంఫైర్ నాటౌట్గా ప్రకటించాడు.
అనంతరం సెంచరీని స్మిత్ డబుల్ సెంచరీగా మలిచాడు. దీంతో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ను 497/8 పరుగులు వద్ద డిక్లేర్ చేసింది. తర్వాత తొలి ఇన్నింగ్స్కు దిగిన ఇంగ్లండ్ రోజు ముగిసేసరికి ఓపెనర్ డెన్లీ (4) వికెట్ కోల్పోయి 23 పరుగులు చేసింది. ఈ యాషెస్ సిరీస్లో ఇప్పటివరకూ స్మిత్ 147. 25 సగటుతో 589 పరుగులు సాధించాడు.