ఆసియాకప్ టోర్నీలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయపడడంతో భారత జట్టు బ్యాలెన్స్ తప్పిందని, అందువల్లే ఆసియా కప్లో సూపర్ ఫోర్ దశలోనే భారత్ నిష్క్రమించాల్సి వచ్చిందని ఆఫ్ఘనిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. రవీంద్ర జడేజా కుడి మోకాలి గాయంతో ఆసియా కప్ టోర్నమెంట్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. అతను తప్పుకోవడంతో అతని స్థానంలో స్టాండ్బై అయిన అక్షర్ పటేల్ను జట్టులోకి చేర్చారు. ఇక జడేజా లేకపోవడంతో జట్టు మేనేజ్మెంట్ జట్టు కూర్పులో కొన్ని మార్పులు చేసింది. దీంతో జట్టు లైనప్ కాస్త గందరగోళంగా మారింది.
ఇకపోతే భారత్ తమ ప్రారంభ మ్యాచ్లో పాకిస్థాన్తో తలపడగా.. రవీంద్రా జడేజా నాలుగో స్థానంలో బరిలోకి దిగడం, విలువైన పరుగులు చేయడంతో భారత్ గెలుపొందిన సంగతి తెలిసిందే. జడేజాను ఆ స్థానంలో పంపడం ద్వారా పాకిస్థాన్ను భారత జట్టు ఆశ్చర్యపరిచింది. దీంతో పాక్ ముందుగా అనుకున్న కొన్ని ప్రణాళికలను జడేజా ఆర్డర్ కాస్త ప్రభావితం చేసింది. ఇక చివర్లో హార్దిక్ రాణించడంతో భారత్ పాకిస్తాన్పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
జడేజా హాంకాంగ్తో రెండో మ్యాచ్లోనూ కీలక రనౌట్ చేశాడు. ఇకపోతే అస్గర్ ఆఫ్ఘన్ మాట్లాడుతూ.. 'పేపర్ మీద టీమిండియా ఆసియా కప్ గెలవగలిగే అత్యుత్తమ జట్టుగా కన్పించింది. జట్టు బ్యాలెన్స్ చాలా బాగుంది. కానీ బహుశా టీమిండియా కొంచెం తేలికగా తీసుకున్నట్లు అనిపించింది. సూపర్ 4దశలో భారత్ ఓటమికి ప్రధాన కారణం రవీంద్ర జడేజాకు గాయం. ఇది వారి జట్టు బ్యాలెన్స్ను చాలా ప్రభావితం చేసింది.' అని అస్గర్ తెలిపాడు.
ఇకపోతే ఈ నెల ప్రారంభంలో.. జడేజా మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. 'శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ సమయంలో నాకు మద్దతుగా నిలిచిన బీసీసీఐకి, నా సహచరులకు, సహాయక సిబ్బందికి, ఫిజియోలకు, వైద్యులకు, అభిమానులకు అందరికీ ధన్యవాదాలు. త్వరలో నా రిహబిలిటేషన్ ప్రారంభిస్తాను. వీలైనంత త్వరగా క్రికెట్లోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తాను.' అని జడేజా పేర్కొన్నాడు.