హైదరాబాద్: షార్ట్ ఫార్మాట్లో ధాటిగా ఆడే ప్రయత్నంలో.. బ్యాట్స్మెన్ త్వరగా వికెట్లు సమర్పించుకోవడం సహజం. అదే టెస్టుల విషయానికొస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది. క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకొని భారీ ఇన్నింగ్స్ ఆడేందుకే బ్యాట్స్మెన్ ప్రాధాన్యతనిస్తుంటాడు. దీంతో బౌలర్లు వికెట్లు పడగొట్టడానికి తీవ్రంగా శ్రమించాల్సిందే. టీ 20 ఫార్మాట్లో చెలరేగుతున్న అఫ్గాన్ యువ సంచలనం రషీద్ ఖాన్కు అదే మాదిరి టెస్టు ఫార్మాట్లో రాణించడం అంత సులవైన విషయం కాదని భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ అభిప్రాయపడ్డాడు.
'రషీద్ఖాన్ గొప్ప బౌలరే. కానీ, అతను పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే అద్భుతాలు చేయగలడు. టెస్టు ఫార్మాట్ వంటి పెద్ద టోర్నీల్లో మాత్రం ఇది సాధ్యపడదు. అతనితోపాటు జట్టులో ముజీబ్ లాంటి మెరుగైన బౌలర్లు ఉన్నా.. ఆ జట్టుకు కొత్త ఫార్మాట్లో కుదురుకోవడం కష్టమేనని' లాల్ పేర్కొన్నాడు.
అయితే ప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో విశేషంగా రాణిస్తూ అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్తో పాటు, తాజాగా బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లోనూ జోరు కొనసాగించాడు. బంగ్లాతో సిరీస్లో ఆడిన మూడు మ్యాచ్లలో 8వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్నాడు.
ఈ క్రమంలో బెంగళూరు వేదికగా అఫ్గాన్ జట్టు భారత్పై టెస్టు అరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకూ ఆకట్టుకున్న రషీద్ఖాన్.. టెస్టులలో మాత్రం అంత సులభం కాదని భారత మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ అభిప్రాయపడ్డాడు. ఇక అరుణ్లాల్ భారత్ తరుపున 13 వన్డేలు, 16 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు.
2017లో ఐసీసీ సభ్యత్వం పొందిన అఫ్గాన్.. ప్రపంచకప్ క్వాలిఫైయర్ టోర్నీలో టైటిల్ నెగ్గి 2019 ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఇటీవలే టెస్టు హోదా దక్కించుకున్న అఫ్గాన్ జూన్ 14 న భారత్తో అరంగేట్ర టెస్ట్ ఆడనుంది. ఈ చారిత్రాత్మక టెస్టుకోసం అఫ్గాన్ ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. అయితే బంగ్లాదేశ్తో జరిగిన మూడు టీ20ల సిరీస్లో క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా తొలి టెస్టులోను గెలిచి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది.