|
నేను స్పీచ్ ఎలా ఇవ్వాలా అని ఆలోచించా
'చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. నేను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్పీచ్ ఎలా ఇవ్వాలా అని ఆలోచించాను. ఏదేమైనా చాలా ఉత్సాహంగా ఉంది. ఈ మ్యాచ్లో పిచ్ సర్ఫేస్ నుంచి మంచి సహకారం లభించింది. దీపక్ చాహర్ భాయ్ ముందే స్వింగ్ బంతులతో ఓ టోన్ సెట్ చేశాను. ఆ తర్వాత నేను నా ప్లాన్లను అమలు చేయాలనుకుని విజయవంతంగా చేయగలిగాను' అని అర్ష్దీప్ చెప్పాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్కు దిగిన భారత్.. గ్రీన్ వికెట్ను చాలా చక్కగా ఉపయోగించుకుంది. తొలి ఓవర్లోనే దీపక్ చాహర్ సూపర్ స్వింగర్తో సఫారీ కెప్టెన్ టెంబా బవుమా(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
|
డేవిడ్ మిల్లర్ ఔట్ స్వింగర్ ఎక్స్ పెక్ట్ చేస్తే..
ఇక రెండో ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్ సైతం అదిరిపోయే స్వింగ్తో క్వింటన్ డికాక్(1)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత మార్క్రమ్ బౌండరీ బాదినా.... చివరి రెండు బంతుల్లో రస్సో(0), డేవిడ్ మిల్లర్(0)లను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చి సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు. దీపక్ చాహర్ వేసిన మూడో ఓవర్లో యువ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్(0) నిర్లక్ష్యపు షాట్ ఆడి క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. దాంతో 9పరుగులకే సఫారీ టీమ్ 5వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తాను తీసిన వికెట్లలో డేవిడ్ మిల్లర్ వికెట్ చాలా నచ్చిందని అర్షదీప్ అన్నాడు. 'నాకు డేవిడ్ మిల్లర్ వికెట్ భలే నచ్చింది. అతను ఔట్స్వింగర్ ఎక్స్ పెక్ట్ చేశాడు. కానీ నేను బంతిని ఇన్ స్వింగ్ చేయగలిగాను. తద్వారా బౌల్డ్ అయ్యాడు. అసలు ఆ వికెట్ భలే మజానిచ్చింది.' అని అర్ష్దీప్ తెలిపాడు.
ఎన్సీఏలో కష్టపడి శిక్షణ పొందాను
ఇకపోతే సౌతాఫ్రికా పతనాన్ని కోలుకునేలా చేసింది కేశవ్ మహరాజ్. అతను 35బంతుల్లో 41పరుగులు చేసి ఇన్నింగ్స్ గౌరవప్రదంగా ముగించేందుకు దోహదపడ్డాడు. కేశవ్ గురించి కూడా అర్ష మాట్లాడుతూ..'మేము కేశవ్ మహారాజ్ వికెట్ కూడా తీయాలనుకున్నాం. కానీ అతను బాగా బ్యాటింగ్ చేశాడు. మేము ఇంకేదైనా వేరే ప్రణాళికతో అతన్ని ఔట్ చేయాల్సింది. ఏదేమైనా మేము మ్యాచ్ గెలిచాం, అది ముఖ్యం. నేను ఇన్నాళ్లు ఎన్సీఏలో కష్టపడి శిక్షణ పొందాను. ఇక ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.' అని అర్షదీప్ సింగ్ ముగించాడు.
సూర్య, రాహుల్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో..
ఇకపోతే సౌతాఫ్రికా విధించిన 107 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.4ఓవర్లలో కేవలం 2వికెట్లు కోల్పోయి ఛేదించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 16.4ఓవర్లలో 2వికెట్లకు 110 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. సూర్యకుమార్ యాదవ్ (33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 50), కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ తీసారు. రెండవ మ్యాచ్ అక్టోబరు 2న గౌహతిలో, అక్టోబరు 4న మూడవ మ్యాచ్ ఇండోర్ వేదికగా జరగనుంది.