హైదరాబాద్: ప్రముఖ క్రికెటర్, టీం ఇండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కృష్ణా జిల్లాకు విచ్చేశారు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా సేవలందించిన తెలుగు తేజం సీకే నాయుడు విగ్రహాన్ని స్పిన్ దిగ్గజం కుంబ్లే మచిలీపట్నంలో ఆవిష్కరించారు. ఉదయం 9.30 గంటలకు మూడు స్తంభాల సెంటర్ దగ్గర కుంబ్లేకు క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి గోసంగం వరకు ర్యాలీ నిర్వహించారు.
నవ్యాంద్రలో తొలి అథ్లెటిక్ స్టేడియం మచిలీపట్నంలో ప్రారంభం కాబోతోంది. రూ.15 కోట్లతో నిర్మించనున్న మైదానం పనులకు మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ఎందరో క్రీడాకారులకు పుట్టినిల్లు అయిన మచిలీపట్నంలో ఇప్పటివరకూ క్రీడాపరమైన వసతులు లేవని ఆ కొరత తీర్చేలా స్టేడియం ఏర్పాటు చేయడం హర్షనీయమని కోచ్లు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.
తర్వాత 10 గంటలకు స్టేడియం నిర్మాణానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు. గోసంగం నుంచి ర్యాలీగా బయలు దేరి నేషనల్ కాలేజ్, రాజుపేట, కోనేరుసెంటర్, బస్టాండ్, లక్ష్మీటాకీస్ సెంటర్ మీదుగా జెడ్పీ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ టీమిండియా మాజీ కెప్టెన్ సీకే నాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.
నాయుడు టీమిండియాకు విశేష సేవలందించారని స్పిన్ దిగ్గజం కుంబ్లే కొనియాడారు. తన చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు కుంబ్లే తెలిపారు. గతంలో ఇండియన్ క్రికెట్ టీంకు కెప్టెన్గా మచలీపట్నం వాసి అయిన సీకే నాయుడు 1932-34 మధ్య కాలంలో వ్యవహరించారు.