ముంబై: క్రికెట్ బంతిపై మెరుపు తీసుకొచ్చేందుకు కృతిమ పదార్థాన్ని అనుమతించలేమని ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్, టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశారు. బ్యాటు, బంతి మధ్య సమతూకం కోసం పిచ్లను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. బంతిపై ఉమ్మి రుద్దకుండా ఆడాలంటే కాస్త సమయం పడుతుందన్నారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బంతిపై ఉమ్మి రుద్దడాన్ని ఐసీసీ తాత్కాలికంగా నిషేధించిన విషయం తెలిసిందే.
యువరాజ్ సింగ్పై పోలీసు కేసు.. టార్గెట్ రోహిత్ శర్మ కూడా!!
బంతిని స్వింగ్ చేయాలంటే.. ఉమ్మి కాకుండా మరో ప్రత్యామ్నాయ పదార్థాన్ని ఐసీసీ అనుమతించాలని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, జేమ్స్ ఆండర్సన్, ప్యాట్ కమిన్స్, టీమ్ సౌథీ సహా చాలా మంది పేసర్లు కోరుతున్నారు. ఉమ్మి రుద్దకుంటే.. బ్యాటు, బంతి మధ్య పోటీ సమానంగా ఉండన్నారు. అయితే బౌలర్ల ప్రతిపాదనతో అనిల్ కుంబ్లే ఏకీభవించలేదు.
'క్రికెట్లో బౌలింగ్కు అనుకూలించే పిచ్లను రూపొందించి బంతి, బ్యాటుకు మధ్య సమతూకం తీసుకురావొచ్చు. పిచ్పై పచ్చికను ఉంచొచ్చు. సంప్రదాయ స్వింగ్, రివర్స్ స్వింగ్కు అనుకూలించకపోతే.. ఇద్దరు స్పిన్నర్లను ఆడించొచ్చు. వన్డే, టీ20ల గురించి ఎవరికీ ఎలాంటి ఆందోళన లేదు. టెస్టుల విషయంలో మాత్రమే ఆందోళన చెందుతున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పిచ్లపై ఇద్దరు స్పిన్నర్లతో ఆడించడం జరగదు. ఇప్పుడు ఇద్దరు స్పిన్నర్లను ఆడించొచ్చు' అని కుంబ్లే అన్నారు.
బంతిని స్వింగ్ అవ్వడానికి మరో ప్రత్యామ్నాయ పదార్థాన్ని ఉపయోగించొచ్చు కానీ.. అది ఆటలో సృజనాత్మకతను కోల్పోయేలా చేస్తుంది అని కుంబ్లే పేర్కొన్నారు. 'ఉమ్మి లేకుండా అలవాటు పడేందుకు ఆటగాళ్లకు కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది. క్రికెట్ తిరిగి ప్రారంభమైతే బౌలర్లు సన్నద్ధమయ్యేందుకు సమయం పడుతుంది. వేర్వేరు దేశాల్లో వేర్వేరు పరిస్థితులు ఉంటున్న దృష్ట్యా క్రికెట్ను పునః ప్రారంభించేందుకు వివరణాత్మక మార్గదర్శకాలు ఇచ్చాం. మూడు నెలలుగా సాధన లేకపోవడంతో క్రికెటర్లు గాయపడే అవకాశం ఎక్కువగా ఉంది. వారి శారీరక, మానసిక పనిభారాన్ని అర్థం చేసుకొని చర్యలు తీసుకోవాలి' అని వివిధ బోర్డులకు కుంబ్లే సూచించారు.