ఇదే సరైన సమయం:
'పంజాబ్ జట్టు గురించి మాత్రమే ఆలోచించి రాహుల్ను కెప్టెన్గా నియమించలేదు. అతడి కెరీర్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. అతడితో జట్టులో స్థిరత్వం వచ్చింది. కెప్టెన్గా జట్టు బాధ్యతలు అందుకోవడానికి అతడికి ఇదే సరైన సమయం. ఇది రాహుల్ వ్యక్తిగా, నాయకుడిగా ఎదరగడానికి దోహదపడతాయి. అతడికి టీ20 ఫార్మాట్తో పాటు ఇతర ఫార్మాట్లలో రాణించడానికి సాయం చేస్తా' అని కుంబ్లే తెలిపాడు.
రెండు ఏళ్లుగా బాగా ఆడుతున్నాడు:
'ఐపీఎల్లో భారత ఆటగాడు జట్టుకి కెప్టెన్గా ఉంటే మంచి ఫలితాలు వస్తాయని అనుకున్నాం. దీనికి రాహుల్ సరైనోడిగా భావించాం. గత రెండు ఏళ్లుగా పంజాబ్ తరఫున మంచి ప్రదర్శన చేస్తున్నాడు. వచ్చే సీజన్లో రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తాడా అనే విషయంపై పూర్తి స్పష్టత లేదు. నికోలస్ పూరన్ కూడా వికెట్కీపింగ్ చేయగలడు. సీజన్ ఆరంభమయ్యే ముందు దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటాం' అని కుంబ్లే పేర్కొన్నాడు.
రాహుల్పై నమ్మకం ఉంది:
'మ్యాక్స్వెల్, కాట్రెల్, జోర్డాన్లు జట్టుకు బలం కానున్నారు. ఇక రాహుల్తో కలిసి మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, కృష్ణప్ప గౌతమ్ జూనియర్ క్రికెట్, కర్ణాటక జట్టులో ఆడారు. వారి మధ్య ఉన్న సమన్వయం అతడికి ఎంతో ఉపయోగపడుతుంది. అతనిపై నమ్మకం ఉంది. కచ్చితంగా రాణిస్తాడు' అని కుంబ్లే ధీమా వ్యక్తం చేసాడు.
మ్యాక్స్వెల్కు రూ.10.75 కోట్లు:
ఈ నెల 19న జరిగిన వేలంలో పంజాబ్ ప్రాంచైజీ మ్యాక్స్వెల్ (రూ.10.75 కోట్లు), కాట్రెల్ (రూ.8.5 కోట్లు), జోర్డాన్ (3 కోట్లు), రవి బిష్నోయ్ (2 కోట్లు)లను తీసుకున్న విషయం తెలిసిందే. మ్యాక్స్వెల్ కనీస ధర రూ. 2 కోట్లు కాగా.. అతని కోసం పలు ఫ్రాంఛైజీలు పోటీపడగా చివరకూ పంజాబ్ సొంతం చేసుకుంది.