ధర్మశాల: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా అనిల్ కుంబ్లేను నియమించారు. బ్యాటింగ్ కోచ్గా రవిశాస్త్రి పేరు దాదాపు ఖరారైందని తెలుస్తోంది. ధర్మశాలలో బీసీసీఐ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కోచ్ను ఎంపిక చేశారు.
కుంబ్లేను కోచ్గా తీసుకోవడం ద్వారా స్వదేశీ దిగ్గజానికే బీసీసీఐ జై కొట్టింది. డంకన్ ఫ్లెచర్ పదవీ విరమణ తర్వాత దాదాపుగా రెండేళ్లుగా కోచ్ లేకుండానే భారత క్రికెట్ కొనసాగింది. అయితే రవిశాస్త్రి డైరెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టి కోచ్లేని లోటు కనిపించలేదు.
ఎప్పటికప్పుడు తాత్కాలిక ఏర్పాట్లతో ముందుకు పోతున్న బీసీసీఐ ఇప్పుడు కోచ్ను ఎంపిక చేసింది. ఈ పదవికి 57 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో మాజీ డైరెక్టర్ రవిశాస్త్రితో పాటు అనిల్ కుంబ్లే, సందీప్ పాటిల్, వెంకటేశ్ ప్రసాద్ తదదతరులతో పాటు పలువురు విదేశీ దిగ్గజాల దరఖాస్తులు కూడా ఉన్నాయి.
మొత్తం దరఖాస్తులను వడబోసి 20 మందితో ఓ జాబితాను రూపొందించిన బీసీసీఐ.. వారిలో నుంచి హెడ్ కోచ్ను ఎంపిక చేయాలని సచిన్, గంగూలీ, లక్ష్మణ్లతో కూడిన త్రిసభ్య కమిటీకి సూచించింది.
మూడు రోజులుగా పలువురిని ఇంటర్వ్యూ చేసిన ఈ కమిటీ తన నివేదికను బీసీసీఐకి రెండు రోజుల క్రితం అందించింది. కుంబ్లేకు హెడ్ కోచ్ పదవి దక్కడంలో టీమిండియా టెస్ట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, త్రిసభ్య కమిటీలోని సౌరవ్ గంగూలీ కీలక భూమిక పోషించినట్లు వార్తలు వస్తున్నాయి.
కుంబ్లేను కోచ్గా నియమించాం: బీసీసీఐ చీఫ్
టీమిండియా కోచ్గా కుంబ్లేను నియమించినట్లు బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ గురువారం చెప్పాడు. సమావేశంలో అనంతరం ఆయన మాట్లాడుతూ... చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కుంబ్లే ఏడాది పాటు కోచ్గా ఉండనున్నాడు.
త్వరలో బ్యాటింగ్, బౌలింగ్ కోచ్ల పైన నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. టీమిండియాకు స్వదేశీ కోచ్లే మేలు అని అనురాగ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. క్రికెటర్గా కుంబ్లే అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్నామన్నారు. కాగా, బ్యాటింగ్ కోచ్గా దాదాపు రవిశాస్త్రి పేరు ఖరారయిందని తెలుస్తోంది.