బరోడా: 2007-08లో ఆస్ట్రేలియా గడ్డపై చెలరేగిన మంకీగేట్ వివాదంలో ఆస్ట్రేలియా చెత్తగా వ్యవహరించిందని టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అయితే అదే వివాదాన్ని అప్పటి భారత టెస్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే బాగా హ్యాండిల్ చేశాడని ఇర్ఫాన్ కొనియాడాడు. నాలుగు టెస్టుల సిరీస్ని ఆడేందుకు టీమిండియా ఆసీస్ గడ్డపైకి వెళ్లగా.. సిడ్నీ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ని భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మంకీ అంటూ జాతివివక్ష వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
'రిటైర్మెంట్' ధోనీ వ్యక్తిగత నిర్ణయం.. ఆ విషయాన్ని నేను అడగలేను: వెటరన్ బ్యాట్స్మెన్
సిడ్నీ టెస్టులో భారత్ కష్టాల్లో ఉన్న సమయంలో సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్ 8వ వికెట్కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఒకవైపు సచిన్ క్రీజులో పాతుకుపోగా.. మరోవైపు హర్భజన్ మంచి సహకారం అందించాడు. దీంతో ఆసీస్ బౌలర్లు వికెట్ తీయడానికి నానా తంటాలు పడ్డారు. ఇక ఫాస్ట్ బౌలర్ బ్రెట్లీ ఉద్దేశపూర్వకంగానే భజ్జీపై స్లెడ్జింగ్కి దిగాడు. భజ్జీ కూడా తగ్గకపోవడంతో వాగ్వాదం పెద్దయింది. ఈ సమయంలో ఎంటరైన సైమండ్స్ ఆ గొడవని మరింత పెంచాడు.
సైమండ్స్ కలగజేసుకోవడంతో సహనం కోల్పోయిన హర్భజన్.. మంకీతో తనని పోల్చినట్లు సైమండ్స్ ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత క్రమశిక్షణ చర్యల కింద హర్భజన్ మ్యాచ్ ఫీజులో కోతతో పాటు నిషేధం కూడా విధించారు. అయితే ఆ నిషేధాన్ని ఎత్తివేయకపోతే టూర్ని రద్దు చేసుకుంటామని టీమిండియా పట్టుబట్టింది. ఆ సిరీస్లో అంపైర్లు కూడా ఆస్ట్రేలియాకి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో కేవలం ఒక్క జట్టు మాత్రమే క్రీడాస్ఫూర్తితో ఆడిందని అనిల్ కుంబ్లే స్పందించాడు.
ఆనాటి సంగతుల గురించి స్పోర్ట్స్ టాక్తో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ... 'మంకీగేట్ వివాదం విషయంలో ఆసీస్ మరీ చెత్తగా వ్యవహరించింది. భారత క్రికెటర్లపై అసత్య ప్రచారాలు చేసింది. టీమిండియా కోపంతో ఆడుతోందని చెప్తూ.. మంకీగేట్ గురించే సిరీస్ ఆసాంతం వార్తలు గుప్పించింది. ఒక కెమెరామెన్ హర్భజన్ సింగ్ని ఫాలో అవుతూ వచ్చేవాడు. .అయితే అప్పటి కెప్టెన్ అనిల్ కుంబ్లే ఆ క్లిష్ట పరిస్థితిని బాగా హ్యాండిల్ చేశాడు. ఒక్క జట్టు మాత్రమే క్రీడాస్ఫూర్తితో ఆడింది అన్నాడు. అప్పట్లో ఆసీస్ మీడియా అతి కారణంగా కనీసం హోటల్ వెలుపలికి కూడా మేము వెళ్లేందుకు ఇష్టపడలేదు' అని ఇర్ఫాన్ తెలిపాడు.