హైదరాబాద్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు అశ్విన్ కెప్టెన్ అవడంపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. తమిళనాడుకు చెందిన అశ్విన్ జట్టుకు కెప్టెన్గా ఉండటంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంకెందుకు జట్టు పేరు మార్చుకోండంటూ కామెంట్ల దుమారం లేపుతున్నారు.
అదే జట్టులో ఉన్న యువరాజ్ సింగ్ను తీసుకోవాల్సింది గానీ, చెన్నైకు చెందిన రవిచంద్రన్ అశ్విన్ను ఎలా తీసుకున్నారంటూ మండిపడుతున్నారు. కానీ, సోషల్ మీడియా వేదికగా అశ్విన్ తమ జట్టు నాయకుడిగా ప్రకటించిన సెహ్వాగ్... యువరాజ్కు బదులుగా అశ్విన్ను కెప్టెన్గా ఎందుకు తీసుకున్నాడో వివరించాడు. ఆ ప్రసంగంలో బౌలర్లు అయితే తమ జట్టుకు కెప్టెన్గా బాగా సరిపోతాడని పేర్కొన్నాడు.
2018 జనవరి 27, 28 తేదీల్లో బెంగుళూరు వేదికగా జరిగిన వేలంలో ఆటగాళ్ల జట్లు తారుమారైయ్యాయి. దీంతోనే వచ్చి పడింది అసలు సమస్య. 2015 ఐపీఎల్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడిన రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ వేలంలో పంజాబ్ జట్టుకు అమ్ముడుపోయాడు. పంజాబ్ రాష్టానికి చెందిన హర్బజన్ సింగ్ ఇంతకుముందు వరకు ముంబై ఇండియన్స్ తరపున అడి ఈ సారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేయడంతో అతను చెన్నైకి వెళ్లిపోయాడు.
ఎలాగూ ఐపీఎల్ వేలం ముగిసిన మూడో రోజే పంజాబ్ జట్టు పేరు మార్చుకుంటామని బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. అలా కామెంట్లను నిజం చేస్తుందేమో చూడాలి. ఐపీఎల్ పదకొండో సీజన్ వేలంలో నేపాలీ టీనేజర్ సందీప్ లామిచ్చానె, అఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ ప్రారంభ ధరను దాటి అత్యధిక ధరకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే.