|
బంగ్లా ప్లేయర్ల ఓవరాక్షన్:
అండర్-19 ప్రపంచకప్లో తొలిసారి చాంపియన్గా నిలిచిన ఆనందంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు అతిగా ప్రవర్తించారు. విజయానికి అవసరమైన సింగిల్ రాగానే.. డగౌట్లో ఉన్న ఆటగాళ్లంతా ఉద్వేగంతో ఒక్కరిగా మైదానంలోకి దూసుకొచ్చారు. అలా వస్తూనే భారత ఆటగాళ్లను గేలి చేస్తున్నట్టుగా అరిచారు. ముఖ్యంగా పేసర్ షోరిఫుల్ ఇస్లాం రెచ్చిపోయాడు. భారత ఆటగాళ్లపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసి కవ్వించాడు.
|
రిజర్వ్ ఆటగాడితో గొడవ:
మైదానంలో ఓ బంగ్లాదేశ్ ఆటగాడు ఏకంగా గొడవకు దిగాడు. ఓ భారత క్రికెటర్ని నెట్టివేసాడు. అక్కడే ఉన్న అంపైర్ జోక్యం చేసుకోకోవడంతో గొడవ సద్దుమణిగింది. మరోవైపు డగౌట్ నుంచి భారత కోచ్ పారస్ మాంబ్రే భారత ఆటగాళ్లు అందరినీ రమ్మని సైగ చేశాడు. అంతకుముందు భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనూ పేసర్ షోరిఫుల్ బంతిబంతికీ ఓపెనర్లపై స్లెడ్జింగ్కు దిగాడు. బ్యాట్స్మన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
హసన్ అత్యుత్సాహం:
టాస్ ఓడి మొదటగా భారత్ బ్యాటింగ్ చేస్తోంది. వికెట్ పడకపోవడంతో బంగ్లా బౌలర్లు అసహనానికి గురయ్యారు. రెండో ఓవర్ను బంగ్లా ఫాస్ట్ బౌలర్ తన్జీమ్ హసన్ వేస్తున్నాడు. భారత బ్యాట్స్మన్ దివ్యాన్ష్ సక్సేనా స్ట్రైకింగ్లో ఉన్నాడు. హసన్ వేసిన రెండో ఓవర్ మూడో బంతిని సక్సేనా డిఫెండ్ చేశాడు. తనవైపే వచ్చిన బంతిని అందుకున్న హసన్ వెంటనే సక్సేనా మీదకి విసిరాడు. తలకు దగ్గరగా వచ్చిన ఆ బంతి నుంచి సక్సేనా తప్పించుకున్నాడు. దీంతో హసన్, సక్సేనా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
రాణించిన జైశ్వాల్:
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (88; 121 బంతుల్లో 8x4, 1x6), తిలక్ వర్మ (38; 65 బంతుల్లో 3x4) రాణించడంతో భారత్ ఆ మాత్రం స్కోరు చేసింది. బంగ్లా బౌలర్లలో అవిషేక్ దాస్ (3), షోరిఫుల్ ఇస్లామ్(2), తన్జిమ్ హసన్(2), రకీబుల్ హసన్(1) వికెట్ తీశారు. ఆ తర్వాత పర్వేజ్ ఇమాన్ (47; 79 బంతుల్లో 7x4), అక్బర్ అలీ (43; 77 బంతుల్లో 4x4, 1x6) బాధ్యతాయుతంగా ఆడి బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్(4), సుశాంత్ మిశ్రా(2), జైశ్వాల్ (1) వికెట్ తీశారు.