రెండేళ్ల విరామం తర్వాత పునరాగమనం
రెండేళ్ల విరామం తర్వాత టోర్నీలోకి పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్లో ఒకే ఒక్క మ్యాచ్ని తమ సొంతగడ్డపై ఆడింది. ఈ మ్యాచ్లో చెన్నై ఘన విజయం సాధించింది. అదే సమయంలో కావేరీ జల వివాదంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేలరేగాయి.
చెన్నై మ్యాచ్లను పూణెకు తరలించిన బీసీసీఐ
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్లను పూణెకు తరలించారు. అయితే, సొంతగడ్డపై చెన్నై అభిమానులు చూపించిన ఆదరణకు ఫిదా అయిన చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఓ అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఓ ఐపీఎల్ మ్యాచ్ కోసం చెన్నై నుంచి పూణెకు రైలుని బుక్ చేసింది.
|
అభిమానుల కోసం రైలుని బుక్ చేసిన చెన్నై యాజమాన్యం
సాధారణంగా ఏదైనా పర్యాటక ప్రాంతాలకు వెళ్లే యాత్రికులు, ర్యాలీలకు, రాజకీయ పార్టీల భారీ బహిరంగ సభలకు హాజరయ్యేందుకు ఏదైనా దూర ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మాత్రమే రైలును మొత్తాన్ని బుక్ చేస్తారు. కానీ, చెన్నై యాజమాన్యం మాత్రం ఫ్యాన్స్ కోసం రైలు మొత్తాన్ని బుక్ చేసింది.
|
ఐపీఎల్ చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి
ఐపీఎల్ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే మొట్టమొదటిసారి. దీంతో గురువారం చెన్నై సెంట్రల్ స్టేషన్ చెన్నై అభిమానులతో కిటకిటలాడింది. దాదాపు 1000 మంది కోసం స్పెషల్ ట్రైన్ విజిల్పోడు ఎక్స్ప్రెస్-పుణె పేరుతో ప్రత్యేక ట్రైన్ బుక్ చేశారు. టీమ్ మేనేజ్మెంట్ సభ్యులు కూడా కొందరు అభిమానులతో ఇదే రైలులో పూణెకు బయల్దేరనున్నారు.
|
చెన్నై అభిమానులు సంతోషం
దీనిపై సీఎస్కే ఫ్యాన్ క్లబ్ మెంబర్ ప్రభు మాట్లాడుతూ 'చెన్నై మ్యాచ్లను పూణెకు తరలించడంతో అభిమానులంతా నిరాశకు గురయ్యారు. దీంతో చెన్నై యాజమాన్యాన్ని డిస్కౌంట్తో కూడిన రైలు లేదా ప్లైట్ టిక్కెట్లను ఇప్పించాల్సిందిగా కోరాం. అలా సాధ్యం కాకుంటే టికెట్ డబ్బుని తిరిగి ఇచ్చేమని అడిగాం. కానీ, యాజమాన్యం మాత్రం ఒక అడుగు ముందుకేసి మాకోసం స్పెషల్ ట్రైన్నే బుక్ చేసింది' అని సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
|
శుక్రవారం రాజస్థాన్తో తలపడనున్న చెన్నై
టోర్నీలో భాగంగా శుక్రవారం పూణె వేదికగా రాజస్థాన్ రాయల్స్తో చెన్నై తలపడనుంది. ఇందులో భాగంగా అభిమానులకు కాంప్లిమెంటరీ పాస్లను కూడా మేనేజ్మెంట్ ఇచ్చింది. పూణెలో ఉండేందుకు ఉచిత వసతి సౌకర్యంతో పాటు భోజనాన్ని కూడా ఏర్పాటు చేసింది. చెన్నై యాజమన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.