ఉమ్మికి అనుమతించొచ్చు:
తాజాగా అజిత్ అగార్కర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'మ్యాచ్ ఆడే ముందు ఆటగాళ్లను పరీక్షిస్తారు (కొవిడ్-19 పరీక్షలు). వాళ్లకు కరోనా నెగటివ్ వస్తే.. బంతిపై ఉమ్మి రాసేందుకు అనుమతించడం గురించి ఐసీసీ ఆలోచించాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. వైద్య రంగంలో ఉన్న వాళ్లు దీని గురించి ఇంకా బాగా చెబుతారేమో' అని అన్నాడు. అగార్కర్ భారత్ తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 349 వికెట్లు పడగొట్టాడు.
నిరీక్షించక తప్పదు:
'బంతికి మెరుపు తెప్పించడం చాలా ముఖ్యం. అందులో సందేహం లేదు. కానీ ఉమ్మి ఉపయోగించవచ్చని క్రికెట్ పునరుద్ధరణ జరిగిన వెంటనే చెప్పే పరిస్థితుల్లో ఐసీసీ కమిటీలు (క్రికెట్, మెడికల్) లేవు. అందుకే వాళ్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అది అర్థం చేసుకోవచ్చు. కానీ నిరీక్షించక తప్పదు. ఇంగ్లండ్ సిరీస్లో ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా బౌలర్లకు కష్టమే. కానీ తప్పదు' అని అగార్కర్ చెప్పాడు. బ్యాట్స్మన్కు బ్యాట్ ఎంత ముఖ్యమో బౌలర్కు లాలాజలం ఉపయోగించడం అంత ముఖ్యమన్నాడు.
ఉమ్మిని వాడాల్సిందే:
'బంతి బరువు పెరిగేందుకు, మృదువుగా చేయడానికి మాత్రమే చెమట ఉపయోగపడుతుంది. కానీ రివర్స్ స్వింగ్ రాబట్టాలంటే మాత్రం ఉమ్మిని వాడాల్సిందే. అది బంతిని గట్టిగా చేయడంతో పాటు మెరుపు తెచ్చి రివర్స్ స్వింగ్ అయ్యేలా చేస్తుంది. కానీ ఇప్పుడు ఉమ్మిని వాడవద్దంటున్నారు. ఇది మాకు పెద్ద సవాలే.'అని భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ తెలిపాడు. 'ఉమ్మి వాడకుంటే బంతి.. గాలిని అంతగా కట్చేయలేదు. ముఖ్యంగా రివర్స్ స్వింగ్ విషయంలో ఉమ్మిలా చెమట ప్రభావం చూపలేదు. టెస్ట్ క్రికెట్పై దీని ప్రభావం ఎక్కువగా పడనుంది. కాబట్టి ఐసీసీ బాధ్యత తీసుకొని బౌలర్లకు అనుకూలంగా పిచ్లు తయారు చేసేలా చూడాలి. లేకుంటే ఆట బ్యాట్స్మన్కు అనుకూలంగా మారిపోతుంది' అని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.