
హైదరాబాద్: కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం సఫారీ గడ్డపై పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య ఐదో వన్డే మంగళవారం పోర్ట్ ఎలిజిబెత్లోని సెయింట్ జార్జి పార్క్ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత క్రికెటర్లు ఐదో వన్డేలో విజయం కోసం సోమవారం తీవ్రంగా నెట్స్లో శ్రమించారు.
కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలో బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆటగాళ్లు గంటల తరబడి ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ సెషన్ అనంతరం భారత క్రికెటర్ రహానె, కోచ్ రవిశాస్త్రిలు అభిమానులకు ఆటోగ్రాఫ్లు ఇస్తూ, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రాక్టీస్ సెషన్లో భాగంగా ధోని స్పిన్ బౌలింగ్ను ప్రాక్టీస్ చేశాడు. ఎప్పుడూ బ్యాటింగ్, కీపింగ్ ప్రాక్టీస్ చేసే ధోని స్పిన్నర్లు చాహల్, కుల్దీప్, అక్షర్పటేల్తో కలిసి నెట్స్లో లెగ్స్పిన్ సాధన చేశాడు. ఈ వీడియోని అభిమానుల కోసం బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
ఆరు వన్డేల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఐదో వన్డే జరగనుంది. ఈ సిరిస్లో ఇప్పటికే భారత్ 3-1తో ఆధిక్యంలో ఉంది. ఐదో వన్డేలో కోహ్లీసేన విజయం సాధిస్తే సఫారీ గడ్డపై సిరీస్ గెలిచిన భారత తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. అలా జరగని పక్షంలో సిరిస్ ఫలితం ఆరో వన్డేకు మారుతుంది.
దీంతో చివరి వన్డేలో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఐదో వన్డే జరిగే సెయింట్ జార్జ్ పార్క్లో భారత్ ట్రాక్ రికార్డు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. 1992 నుంచి ఇక్కడ జరిగిన ఐదు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. అంతేకాదు ఈ నాలుగు మ్యాచ్ల్లో ఒక్కదాంట్లో కూడా 200కు పైగా పరుగులు నమోదు చేయలేకపోయింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.