పేస్ పిచ్పై కూడా తేలిపోయాడు:
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్లో బరిలోకి దిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేదు. 36.4 ఓవర్లు వేసి 92 రన్స్ ఇచ్చాడు. దీంతో భారత్ ఓటమికి పరోక్షంగా కారకుడయ్యాడు. మరోవైపు షమీ, అశ్విన్ నాలుగేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ మూడు, జడేజా ఒక వికెట్ తీశారు. సీనియర్ బౌలర్గా భారత బౌలింగ్ విభాగంను ముందుండి నడిపించాల్సిన ఇషాంత్.. పేస్ పిచ్పై కూడా తేలిపోయాడు. మూడు వికెట్లు పడగొట్టినా అది చెప్పుకోదగ్గ ప్రదర్శన మాత్రం కాదు. ఈ నేపథ్యంలోనే ఇషాంత్పై టీమిండియా మాజీ క్రికెటర్ బల్విందర్ సింగ్ మండిపడ్డారు.
ఇషాంత్ కొత్త కుర్రాడిలానే:
'మూడో రోజు (ఆదివారం) భారత పేసర్లు తక్కువ లెంగ్తుల్లో బంతులు విసిరారు. ఐదవ రోజు (మంగళవారం) మాత్రం సరైన లెంగ్తుల్లో కాకుండా ముందుకు వేశారు. బ్యాట్స్మెన్ ఫ్రంట్ఫుట్తో ఆడేలా చేయడం బౌలర్ల బాధ్యత. ఈ విషయంలో వారు అలసిపోయినట్టు అనిపించింది. బ్యాట్స్మెన్ ముందుకొచ్చి డ్రైవ్ చేసేలా బంతులు వేస్తేనే వికెట్లు దక్కుతాయి. 100 టెస్టులు ఆడిన తర్వాత ఇషాంత్ కొత్త కుర్రాడిలానే కనిపించాడు. బౌలింగ్ దాడిని అతడు ముందుండి నడిపించాలి. షమీ ఆ పాత్ర పోషిస్తున్నాడు. బుమ్రా సైతం బంతిని సీమ్ చేయకుండా నిరాశ పరిచాడు' అని 1983 ప్రపంచకప్ విజేత జట్టులోని సభ్యుడు బల్విందర్ సింగ్ అన్నాడు.
సీమ్తో పాటు స్వింగ్ ఉంటేనే:
మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారత బౌలర్లు సరైన బౌలింగ్ లైనప్ను ఎంచుకోలేదన్నాడు. 'బంతిని సీమ్తో పాటు స్వింగ్ చేసే బౌలర్ అవసరం. న్యూజిలాండ్ అదే చేసింది. కివీస్ పేసర్లు వేగంగా బంతులు వేయరు. వారు కచ్చితత్వంతో సరైన లైన్ అండ్ లెంగ్తుల్లో వేశారు. 90 లేదా 100 కి.మీ వేగంతో బంతులు విసిరి బ్యాట్స్మెన్ను ఔట్ చేయలేం. సీమ్తో పాటు స్వింగ్ ఉంటేనే అది సాధ్యం. ఇక్కడే భారత్ విఫలమైంది' అని రోజర్ బిన్నీ పేరొన్నారు. బిన్నీ భారత్ తరఫున 27 టెస్టులు, 72 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 47, వన్డేల్లో 77 వికెట్లు పడగొట్టారు.