హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు మునుపెన్నడూ చూపించని ప్రతిభను ప్రదర్శించాలని తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు వ్యక్తిగతంగానూ జట్టు పరంగానూ తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటున్నారు. ఇందులో భాగంగా సెంచూరియా స్టేడియంలో ప్రాక్టీస్ ను ముమ్మరం చేసింది.
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు శనివారం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో టీమిండియా నెట్స్లో ముమ్మర సాధన చేస్తోంది. తొలి టెస్టులో ఓటమి పాలవ్వడంతో రెండో మ్యాచ్ చావోరేవో అన్నట్టుగా మారింది. ఈ పోరులో ఓడితే 2-0తో సిరీస్ చేజారడం ఖాయం. కనీసం డ్రా చేసుకోగలిగితే చివరి మ్యాచ్లోనైనా గెలిచే అవకాశాలుంటాయి. అందుకే బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్ల నేతృత్వంలో భారత జట్టు కఠినంగా శ్రమిస్తోంది. ఆటగాళ్లు చెమటలు కక్కేలా సాధన చేస్తున్నారు. ఈ సందర్భంగానే భారత అగ్ర శ్రేణి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేస్ బౌలర్గా మారాడు!
Just for fun - when @ashwinravi99 decided to bowl seam instead of spin #SAvIND pic.twitter.com/7bsCpndNkk
— BCCI (@BCCI) January 11, 2018
రెండో మ్యాచ్ జరిగే సెంచూరియన్లో పిచ్ పేసర్లకు స్వర్గధామం. అదనపు బౌన్స్, స్వింగ్కు సహాయకారిగా ఉంటుంది. ఈ మ్యాచ్లో టీమిండియా నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. భువి, షమి, బుమ్రా తొలి మ్యాచ్లో ఆడారు. రెండో మ్యాచ్లో వారితో పాటు ఉమేశ్ యాదవ్కు చోటు దక్కడంలో అనుమానమేమీ లేదు! దీంతో నెట్స్లో సాధన చేసిన బ్యాట్స్మన్ కోసం అశ్విన్ స్పిన్ను వదిలి పేస్ బౌలింగ్ వేశాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విటర్లో ఉంచింది. అశ్విన్ పేస్ బౌలింగ్ వీడియోను చాలా మంది వీక్షిస్తున్నారు.
కెరీర్లో 56 టెస్టులు ఆడిన అశ్విన్ 16,105 బంతులు విసిరాడు. 306 వికెట్లు తీశాడు. సగటు 25.35గా ఉండగా ఎకానమీ 2.89గా ఉంది. నాలుగు వికెట్లు 12 సార్లు, ఐదు వికెట్ల ఘనత 26 సార్లు సాధించాడు. అటు బ్యాటింగ్లోనూ సత్తా చాటాడు. 30.94 సగటుతో 2,104 పరుగులు సాధించాడు. 4 శతకాలు, 11 అర్ధశతకాలు ఖాతాలో ఉన్నాయి.