పాష్టో మాత్రమే తెలుసు:
ఆఫ్ఘనిస్తాన్ సంచలనం, యువ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు గతేడాది కనుగోలు చేసింది. స్వదేశీయులైన రషీద్ ఖాన్, మహ్మద్ నబీల మాదిరిగా ముజీబ్ ఇంగ్లీష్-హిందీ భాషలను మాట్లాడలేడు. ఈ ఆఫ్ స్పిన్నర్కు పాష్టో మాత్రమే తెలుసు. ముజీబ్ మీడియాతో మాట్లాడినప్పుడల్లా అతనితో ఒక వ్యాఖ్యాత ఉండేవాడు. మరోవైపు జట్టులోని ఆటగాళ్లతో, యాజమాన్యంతో ముజీబ్ చర్చలు జరిపేందుకు ఇబ్బందిగా కూడా ఉంది.
|
మరింత నేర్చుకుంటా:
ముజీబ్ పంజాబ్ జట్టులోని కొందరు ఆటగాళ్లు పాష్టో భాష నేర్చుకునేలా చేయగలిగాడు. ఫ్రాంచైజీ సహ యజమాని ప్రీతి జింటా కూడా పాష్టో భాష నేర్చుకుంది. అంతేకాదు తాజాగా తన స్నేహితురాలితో కూడా ఆ భాషను మాట్లాడింది. ఇందుకు సంబందించిన వీడియోను ప్రీతి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'నా స్నేహితురాలు జైనాబ్తో పాష్టో నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముజీబ్ పాష్టో నేర్పించినందుకు ధన్యవాదాలు. వచ్చే ఐపీఎల్లో మరింత నేర్చుకుంటాను' అని ప్రీతి జింటా ట్వీట్ చేసింది. ముజీబ్ కూడా ప్రీతి పోస్టుకు రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీరు ఓ సారి ప్రీతి జింటా మాటలు వినండి.
ప్రీతి జింటా ప్రత్యేక హగ్:
ప్రీతి జింటా ఐపీఎల్లో తెగ ఎంజాయ్ చేస్తుంటుంది. పంజాబ్ మ్యాచ్ గెలిచినప్పుడు ఆటగాళ్లకు హగ్ ఇచ్చి ప్రత్యేకంగా అభినందనలు తెలపడం ప్రీతి స్టయిల్. ఐపీఎల్-12లో పంజాబ్ బౌలర్ సామ్ కరన్ హ్యాట్రిక్ తీసిన అనంతరం ప్రీతి హగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో యువీ కి కూడా హగ్ ఇచ్చింది. ఇటీవలే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ హెడ్ కోచ్గా భారత మాజీ కోచ్ అనిల్ కుంబ్లే ఎంపికయిన విషయం తెలిసిందే.
కెప్టెన్గా అశ్విన్ విఫలం:
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పంజాబ్ జట్టుకు కెప్టెన్. లీగ్ ఆరంభం నుండి చెన్నై సూపర్ కింగ్స్కు ఆడిన అశ్విన్.. 2018, 2019 సీజన్లలో పంజాబ్ జట్టుకు ఆడాడు. అశ్విన్ కెప్టెన్సీలో గత ఏడాది పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచిన పంజాబ్.. ఈ ఏడాది ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో అతడికి సారధ్య భాద్యతలు ఇస్తారో లేదో చూడాలి.