అహ్మదాబాద్: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టీ20 లీగ్ ఫ్రాంచైజీపై దృష్టి సారించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే ఎమిరేట్స్లో నిర్వహించనున్న టోర్నమెంట్లో ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. యుఏఈ టీ20 లీగ్ ఫ్రాంఛైజీని కొనుగోలు చేయడానికి ప్రణాళికలను రూపొందించుకుంది. దీనికోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడట్లేదా సంస్థ.
నిజానికి- ఐపీఎల్ గుజరాత్ ఫ్రాంఛైజీని కొనుగోలు చేయడానికి అదాని గ్రూప్ తీవ్ర ప్రయత్నాలను సాగించిన విషయం తెలిసిందే. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్దేశించిన బేస్ ప్రైస్ కంటే రెట్టింపు ధరతో బిడ్డింగ్ దాఖలు చేసింది. 5,100 కోట్ల రూపాయలతో బిడ్డింగ్ వేసింది. అయినప్పటికీ.. గుజరాత్ ఫ్రాంఛైజీని దక్కించుకోలేకపోయింది. దీనికి కారణం- సీవీసీ కేపిటల్స్ అంతకంటే ఎక్కువ ధరను కోట్ చేయడమే. గుజరాత్ టైటన్స్ పేరుతో ఐపీఎల్ ఫ్రాంఛైజీని ఏర్పాటు చేసిన సీవీసీ కేపిటల్స్ ఏకంగా 5,600 కోట్ల రూపాయలతో బిడ్డింగ్ వేసింది. అదాని గ్రూప్ను వెనక్కి నెట్టింది.
ఐపీఎల్లో తన సొంత రాష్ట్రానికి చెందిన ఫ్రాంఛైజీని కొనుగోలు చేసే విషయంలో ఓడిపోయిన అదాని..రచ్చ గెలవడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టీ20 లీగ్ ఫ్రాంఛైజీ కోసం తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ మేరకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ)తో మంతనాలు సాగిస్తోంది. మరో వారం రోజుల్లో దీనికి సంబంధించిన చర్చలు ఓ కొలిక్కి వస్తాయనే అంచనాలు ఉన్నాయి. కాంట్రాక్ట్కు సంబంధించిన ప్రతిపాదనలన్నింటినీ అదాని గ్రూప్ పూర్తి చేసిందని, దానిపై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆమోదముద్ర వేయడమే మిగిలివుందని చెబుతున్నారు.
యూఏఈ టీ20 లీగ్లో ఇప్పటికే అయిదు ఫ్రాంఛైజీలు అమ్ముడుపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత, ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఓనర్ ముఖేష్ అంబాని, కోల్కత నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ షారుఖ్ ఖాన్, ప్రీమియర్ లీగ్లో పాల్గొనే మాంచెస్టర్ యునైటెడ్ యజమాని గ్లేజర్ ఫ్యామిలీ, జీఎంఆ్ గ్రూప్- ఢిల్లీ కేపిటల్స్ ఓనర్ గ్రంధి కిరణ్ కుమార్, క్యాప్రి గ్లోబల్ కంపెనీ యజమాని రాజేష్ శర్మ.. ఇప్పటికే యూఏఈ టీ20 లీగ్ ఫ్రాంఛైజీలను కొనుగోలు చేశారు. తాజాగా ఇదే జాబితాలోకి అదాని గ్రూప్ కూడా చేరడం దాదాపు ఖరారైనట్టే.
ఆరో ఫ్రాంఛైజీ కోసం బిడ్డింగులను ఆహ్వానించింది ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు. దీన్ని దక్కించుకోవడంలో అదాని గ్రూప్ ముందు వరుసలో ఉన్నట్లు వార్తలొస్తోన్నాయి. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీల మేనేజ్మెంట్ను కూడా ఈసీబీ సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు. బిగ్బాష్ లీగ్స్కు చెందిన సిడ్నీ సిక్సర్స్ ఫ్రాంఛైజీలతోనూ టచ్లో ఉందని తెలుస్తోంది. నిజానికి- యుఏఈ 20లీగ్ను జనవరిలోనే షెడ్యూల్ చేసినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది.