
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు చేతిలో ఉండగా.. ఆ జట్టు 294 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజు, శనివారం ఆట ఆఖరుకు ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఎల్గర్ అద్భుత శతకం సాధిస్తే.. రెండో ఇన్నింగ్స్లో మరో ఓపెనర్ మార్క్రమ్ (84) విలువైన పరుగులు చేశాడు.
ఎల్గర్ (14) ఎంతోసేపు నిలవకపోయినా.. ఆమ్లా (31), డివిలియర్స్ (51 బ్యాటింగ్)లతో మార్క్రమ్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. చివర్లో వెలుతురు లేమి కారణంగా ఆట కాస్త ముందుగానే ముగిసింది. క్రీజులో డివిల్లీర్స్తో పాటు డికాక్ (29 బ్యాటింగ్) ఉన్నాడు. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్ను 69.5 ఓవర్లలో 255 పరుగులకు ముగించింది.
అంతకుముందు ఉదయం 245/9తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా.. ఇంకో 10 పరుగులే జోడించి చివరి వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో 311 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా 56 పరుగుల ఆధిక్యాన్ని మూటగట్టుకుంది.
మళ్లీ వర్షం దెబ్బ:
న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలిటెస్టు మూడో రోజుకు కూడా వర్షం ఆటంకం కలిగించింది. శనివారం 17 బంతుల ఆట మాత్రమే సాధ్యంకాగా, కివీస్ తమ ఓవర్నైట్ స్కోరుకు నాలుగు పరుగులు మాత్రమే జత చేసింది. భారీగా కురుస్తున్న వర్షం తెరిపినిచ్చే అవకాశం కనిపించకపోవడంతో అంపైర్లు మూడో రోజు ఆటను రద్దు చేశారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 95 ఓవర్లలో నాలుగు వికెట్లకు 233 పరుగులు చేయగా ప్రత్యర్థిపై 175 పరుగుల ఆధిక్యంలో ఉంది. తమ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 58 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిదే. రెండో రోజు శుక్రవారం కూడా వర్షం కారణంగా 23.1 ఓవర్ల ఆట మాత్రమే ఆడగలిగారు.