హైదరాబాద్: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఇరు జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో సఫారీలు విజయం సాధించారు. శనివారం హోరాహోరీగా జరిగిన ఈ పోరులో కంగారూలను ఖంగుతినిపించారు సఫారీలు. ముగ్గురు ప్రధాన బ్యాట్స్మెన్ అర్ధసెంచరీలు సాధించడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ముందంజ వేసింది.
మ్యాచ్ రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. ఫలితంగా ఆ జట్టు 20 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఏబీ డివిలియర్స్ (74) 14 ఫోర్లతో కూడిన స్కోరుతో తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. డీన్ ఎల్గర్ (57), హషీం ఆమ్లా (56) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.
ఆట ముగిసే సమయానికి డివిలియర్స్తో పాటు ఫిలాండర్ (14 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నాడు. ఓవర్నైట్ స్కోరు 39/1తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా కొద్ది సేపటికే నైట్వాచ్మన్ రబడ (29) వికెట్ కోల్పోయింది. ఈ దశలో ఎల్గర్, ఆమ్లా పట్టుదలగా ఆడారు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 46.3 ఓవర్ల పాటు ఆడారు.
వీరిద్దరు మూడో వికెట్కు 88 పరుగులు జోడించిన అనంతరం ఆస్ట్రేలియా బౌలర్లు రివర్స్ స్వింగ్తో దెబ్బ కొట్టారు. ఒకే స్కోరు వద్ద ఆమ్లా, ఎల్గర్లను ఔట్ చేసిన ఆసీస్... వెంటవెంటనే డు ప్లెసిస్ (9), బ్రుయిన్ (1), డి కాక్ (9)లను పెవిలియన్ పంపించి పట్టు బిగించే ప్రయత్నం చేసింది. అయితే ఎదురుదాడికి దిగిన డివిలియర్స్ బౌండరీలతో విరుచుకు పడి తమ జట్టుకు ఆధిక్యం అందించాడు.