ధోనీ రీఎంట్రీ ఐపీఎల్పై ఆధారపడి లేదు:
ఎంఎస్ ధోనీ రీఎంట్రీకి, ఐపీఎల్ ప్రదర్శనకు అసలు సంబంధమే లేదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. 'ధోనీ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చేది ఐపీఎల్పై ఆధారపడి లేదు. టీమ్ మేనేజ్మెంట్ అతడి సేవలను వినియోగించుకోవాలని అనుకుంటే తప్పకుండా ధోనీ తిరిగి జట్టుకు ఎంపికవుతాడు. ఒకవేళ కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్తో పాటు టీ20 ప్రపంచకప్ జరుగకపోయినా.. మహీకి వచ్చిన నష్టమేమీ లేదు' అని చోప్రా పేర్కొన్నారు. ఒకవేళ ధోనీ కెరీర్లో వరుసగా 18 నెలల పాటు గ్యాప్ వచ్చినట్లయితే.. అతనింకా టీమిండియా తరపున ఆడబోడని అనుకోవచ్చని అన్నారు.
ధోనీ మళ్లీ ఆడతాడనే నమ్మకం లేదు:
'ధోనీ ఫిట్గా ఉండి.. ఆడే అవకాశం ఉంటే.. వికెట్ కీపింగ్కి అతనే నా నెం.1 ఛాయిస్. అయితే నాకు తెలిసి ధోనీ ఇక క్రికెట్ ఆడకపోవచ్చు. అతను ఎప్పుడు ఎలాంటి షాక్ ఇస్తాడో మనం ఊహించలేం. అతను ఇప్పటివరకూ రిటైర్మెంట్ ప్రకటించలేదన్న విషయం నిజమే. కానీ.. అతను పరిస్థితుల్ని ఏ క్షణంలో ఎలా మారుస్తాడో మనకు తెలియదు. మహీ రిటైర్మెంట్ఇస్తాడని చెప్పడం బాధాకరం.. ఎందుకంటే అతడు టీమిండియాకు ఎంతో చేసాడు' అని టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా పేర్కొన్నారు.
అదే ధోనీ లాస్ట్ మ్యాచ్:
హర్భజన్ సింగ్ మాట్లాడుతూ... 'ధోనీ ఐపీఎల్లో ఆడాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. కానీ.. ఇక్కడ అందరికీ తెలియాల్సింది ఏంటంటే భారత్ జట్టుకి మళ్లీ ఆడాలని ధోనీ ఆశిస్తున్నాడా? లేదా?. నా అంచనా ప్రకారం టీమిండియాకి ఆడాలనే ఇంట్రస్ట్ ప్రస్తుతం అతనికి లేదు. మళ్లీ టీమిండియా జెర్సీ ధరించాలని అతనికి లేదు. 2019 వన్డే ప్రపంచకప్లోనే చివరి అంతర్జాతీయ మ్యాచ్ని ఆడేశానని అతను భావిస్తున్నాడు' అని తెలిపారు.
ప్రశ్నార్ధకంలో మహీ భవిష్యత్:
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2018 తర్వాత ఎంఎస్ ధోనీ క్రికెట్కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దాదాపు 9 నెలలు గడిచినా.. మహీ మైదానంలోకి దిగలేదు. తొలుత రెండు నెలల పాటు ధోనీ సెలవులో ఉంటాడని ప్రకటించినా.. ఆ తర్వాత కూడా అతను జట్టులో చేరలేదు. ఇక సెలక్షన్కు కూడా అందుబాటులో లేకపోవడంతో.. అతని బోర్డు కాంట్రాక్ట్ను బీసీసీఐ రద్దు చేసింది. దీంతో రిటైర్మెంట్పై ఒత్తిడి నెలకొన్నా.. మహీ ఎలాంటి విషయం క్లారిటీ ఇవ్వలేదు. ఇక కరోనా కారణంగా మహీ భవిష్యత్ ప్రశ్నార్ధకంలో పడింది.