ముంబై: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లండ్ సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో ఒక్క మణికట్టు స్పిన్నర్ లేకపోవడం తనను ఆశ్చర్యం కలిగించిందని టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నాడు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తీసుకోకపోవడం కఠిన నిర్ణయమేనన్నాడు. కరోనా పరిస్థితుల్లో జంబో జట్లను ప్రకటించే సౌలభ్యం ఉన్నా కూడా యాదవ్ను ఎందుకు తీసుకోలేదని ఆకాశ్ ప్రశ్నించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్తో పాటు ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్కు బీసీసీఐ శుక్రవారం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. 20 మంది ప్రాబబుల్స్తో పాటు నలుగురిని స్టాండ్ బై ప్లేయర్స్గా ఎంపిక చేసింది.
ఈఎస్పీఎన్-క్రిక్ఇన్ఫోతో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... 'వ్యక్తిగతంగా చెప్పాలంటే కుల్దీప్ యాదవ్కూ చోటివ్వకపోవడం కఠిన నిర్ణయమే. అతడు ఎక్కువ క్రికెట్ ఆడలేదనడం బాధాకరం. ఆస్ట్రేలియాలో ఆడలేదు. ఇక ఇంగ్లండ్ టెస్టు సిరీసులో ఒకే మ్యాచ్ ఆడాడు. అయితే బాగా ఇబ్బంది పడ్డాడు. కొన్ని వికెట్లు మాత్రమే తీశాడు. గులాబి టెస్టూ ఆడలేదు. ఇప్పుడు టెస్టు ఛాంపియన్షిప్ ఫైనలే కాదు ఏకంగా ఇంగ్లండ్ సిరీసు మొత్తానికీ ఎంపికవ్వలేదు. కరోనా పరిస్థితుల్లో ఎక్కువ మందితో జట్లను ప్రకటించే సౌలభ్యం ఇప్పుడు ఉంది. అలాంటప్పుడు యాదవ్కు ఎందుకు చోటివ్వలేదు' అని ప్రశ్నించాడు.
Ravinder Pal Singh: కరోనాతో హాకీ దిగ్గజం కన్నుమూత!!
'ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ రూపంలో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. కానీ వారంతా ఫింగర్ స్పిన్నర్లు. మణికట్టు స్పిన్నర్ల బౌలింగ్లో ఇబ్బందిపడే ప్రత్యర్థి ఉన్నప్పుడు కుల్దీప్ యాదవ్ను ఎందుకు తీసుకోకూడదు. బీసీసీఐ సెలెక్టర్లు ఓసారి ఆలోచించండి' అని ఆకాశ్ చోప్రా అన్నాడు. కుల్దీప్ను మాత్రమే కాదు పృథ్వి షా, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యాలను కూడా బీసీసీఐ ఎంపిక చేయలేదు. యువ ఆటగాళ్లకే ఎక్కువ ప్రధాన్యమిచ్చారు. అర్జాన్ నాగ్వాస్వాలా అనే కొత్త కుర్రాడికి స్టాండ్బైగా అవకాశం ఇచ్చారు.
టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గత రెండేళ్లుగా పేలవ ఫామ్తో పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకప్పుడు అన్ని ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాడిగా ఉన్న కుల్దీప్.. ఇప్పుడు అవకాశం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అడపాదడపా వచ్చిన అవకాశంలో కనీసం స్థాయికి తగిన ప్రదర్శన కూడా కనబర్చలేకపోతున్నాడు. ఐపీఎల్ 2019, 2020లోనూ వికెట్లేమీ తీయలేదు. భారత సెలెక్టర్లు అతడికి టీమిండియాకు ఎంపిక చేస్తున్నప్పటికీ.. తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. ఆసీస్ పర్యటనలో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇక ఇంగ్లండ్పై ఆడినా భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక ఐపీఎల్ 2021లోనూ కోల్కతా తరఫున బరిలోకి దిగలేదు.