న్యూఢిల్లీ: భారత జట్టు తరఫున మళ్లీ బరిలోకి దిగుతానని సీనియర్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ధీమా వ్యక్తం చేశాడు. అందుకే 37 ఏళ్లు వచ్చినా క్రికెట్ ఆడుతున్నానని తెలిపాడు.మూడేళ్ల క్రితమే టీమిండియాకు దూరమైన ఈ ఢిల్లీ క్యాపిటల్స్ లెగ్ స్పిన్నర్ ఇంకా జాతీయ జట్టుకు ఆడతాననే నమ్మకంతో ఉన్నాడు. తాజాగా ఓ క్రికెట్ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వయసును బట్టి ఆటగాళ్ల ప్రదర్శనను అంచనా వేయొద్దన్నాడు.
ఇంకా టీమిండియా పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. వన్డేల్లో ఆడాలని ఉందని, అందుకోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఎప్పుడూ ఆ ఆశ అలాగే ఉంటుందని, ఎలాగైనా భారత జట్టుకు మళ్లీ ఆడతాననే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
'నేను ఎప్పుడూ నాతో పోరాడుతూనే ఉంటాను. జాతీయ జట్టులో స్థానాన్ని ఎలాగైనా తిరిగి సంపాందించాలనేదే నా కోరిక. ఎప్పటికైనా మళ్ళీ జాతీయ జట్టుకు ఎంపిక కాగలననే నమ్మకం ఉంది. దానికి సిద్ధంగా ఉండేందుకే ఇప్పటికీ ఆటను కొనసాగిస్తున్నాను. కేవలం ఐపీఎల్ ఆడటం నా లక్షం కాదు. జాతీయ స్థాయిలో రాణించడమే నా లక్షం'అని మిశ్రా చెప్పుకొచ్చాడు. ఇక మిశ్రా భారత్ తరఫున చివరిసారిగా 2017లో ఇంగ్లండ్తో టీ20 మ్యాచ్ ఆడాడు.
ఇక సీనియర్ ఆటగాళ్ల పట్ల టీమ్ మెనేజ్మెంట్, సెలెక్టర్ల వ్యవహరించే తీరుపై మిశ్రా అసహనం వ్యక్తం చేశాడు. జట్టు యాజమాన్యానికి ఏం కావాలో స్పష్టంగా సీనియర్ ఆటగాళ్లతో చర్చించాలన్నాడు. ఒకవేళ వాళ్లు ఫిట్నెస్గా లేకపోతే నేరుగా ఆ విషయం చెప్పాలని, అలా మాట్లాడితే ఆటగాళ్లెవరూ బాధపడరని పేర్కొన్నాడు. టీమిండియా తరఫున మొత్తం 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20లు ఆడిన అమిత్ మిశ్రా 76, 64, 16 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఐపీఎల్లో 147 మ్యాచ్లు ఆడగా 157 వికెట్లతో కొనసాగుతున్నాడు.