2nd ODI: వన్డేల్లో కోహ్లీ 40వ సెంచరీ, ఆస్ట్రేలియాపై ఏడోది


హైదరాబాద్: వన్డేల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఐదు వన్డేల సిరిస్లో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియాతో నాగ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 40 సెంచరీ. ఆస్ట్రేలియాపై ఏడోది కావడం విశేషం. ఈ మ్యాచ్లో కోహ్లీ 107 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో సెంచరీని నమోదు చేశాడు.
ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ కౌల్టర్ నైల్ బౌలింగ్లో ఫోర్ కొట్టి తనదైన శైలిలో కోహ్లీ 40వ సెంచరీని సాధించాడు. ఈ సెంచరీతో వన్డేల్లో అతని సగటు 60కి చేరడం మరో విశేషం. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (49) అగ్రస్థానంలో ఉండగా... విరాట్ కోహ్లీ(40) సెంచరీతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
కోహ్లీ ఒంటరి పోరాటం
ఈ మ్యాచ్లో ఓవైపు సహచరులంతా పెవిలియన్కు క్యూ కడుతున్నా.. ఒంటరి పోరాటం చేసిన కోహ్లీ భారత్కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఓపెనర్ రోహిత్ డకౌట్గా పెవిలియన్ చేరడంతో భారత జట్టు పరుగులేమీ చేయకుండానే తొలి వికెట్ను నష్టపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీతో కలిసి శిఖర్ ధావన్ స్కోరు బోర్డుని నడిపించాడు.
విజయ్ శంకర్తో కలిసి
వీరిద్దరూ 38 పరుగుల జత చేసిన తర్వాత ధావన్(21) రెండో వికెట్గా నిష్క్రమించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడుతో కలిసి కోహ్లీ మరో 37 పరుగులు జత చేశాడు. అనంతరం అంబటి రాయుడు(18) మూడో వికెట్గా పెవిలియన్ బాట పట్టాడు. ఈ దశలో కోహ్లీతో కలిసి విజయ్ శంకర్ నిలకడగా స్కోర్ పెంచుకుంటూ పోయాడు.
వన్డేల్లో కోహ్లీ 40వ సెంచరీ
కానీ దురదృష్టవశాత్తు ఆడమ్ జంపా వేసిన 29వ ఓవర్ ఐదో బంతికి శంకర్(46) నాన్ స్ట్రైకర్ ఎండ్లో రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన కేదార్ జాదవ్(11), ధోనీ(0) వరుస బంతుల్లో పెవిలియన్ చేరడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి కోహ్లీ స్కోర్ను పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీని సాధించాడు.
250 పరుగులకు ఆలౌటైన టీమిండియా
అయితే కాగా ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్లో జడేజా(21) ఖవాజాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కొంత సమయానికే కోహ్లీ(116) భారీ షాట్కు ప్రయత్నించి స్టోయినిస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో 248 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ను నష్టపోయింది. మరొక పరుగు వ్యవధిలో కుల్దీప్ యాదవ్(3) నిష్క్రమించాడు. ఇక చివరి వికెట్గా బుమ్రా డకౌట్గా పెవిలియన్ చేరడంతో భారత్ 48.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications