అడిలైడ్లో కోహ్లీ సెంచరీ: రెండో వన్డేలో భారత్ విజయం

హైదరాబాద్: తప్పక గెలవాల్సిన అడిలైడ్ వన్డేలో టీమిండియా సమిష్టి ప్రదర్శన చేసింది. మూడు వన్డేల సిరిస్లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగడంతో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠకరంగా సాగిన ఈ మ్యాచ్లో ధోని ఫినిషింగ్ టచ్తో విజయం భారత్నే వరించింది.
ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు తడబడినా, పరుగులు రాబట్టడంలో బ్యాట్స్మెన్ చివరి వరకూ పోరాడి విజయం సాధించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లలో షాన్ మార్ష్ (131; 123 బంతులు,11ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ, మాక్స్వెల్(48)లు చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ విఫలమయ్యాడు. వికెట్ ఏమీ తీయకపోగా దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ 4 వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ మూడు, జడేజా ఒక వికెట్ తీశారు. ఆసీస్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది.
దీంతో మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ సిరిస్లో చివరిదైన మూడో వన్డే మెల్బోర్న్ వేదికగా జనవరి 18న జరగనుంది.

రెండో వికెట్కు 54 పరుగులు
299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు శిఖర్ ధావన్ (32), రోహిత్ శర్మ(43) మంచి శుభారంభం అందించారు. అనవసర షాట్కు యత్నించి ధావన్ పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. రోహిత్ శర్మతో కలిసి నెమ్మదిగా ఇన్నింగ్స్ను ఆరంభించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 54 పరుగులు జోడించారు.

క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు
అనంతరం రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరగా, క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడుతో కోహ్లీ బాధ్యాతాయుతంగా ఆడాడు. రాయుడు (24) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మ్యాక్స్వెల్ బౌలింగ్లో స్టోయినిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగాడు. దీంతో మూడో వికెట్కు నమోదైన 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ధోనితో కలిసి కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ను
అనంతరం క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో 105 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్స్ల సాయంతో కెరీర్లో 39వ వన్డే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీ అడిలైడ్లో కోహ్లీకి మొత్తంగా ఐదోది కాగా.. వన్డేల్లో రెండవది కావడం విశేషం. ఇదే అడిలైడ్ వేదికగా కోహ్లీ టెస్ట్ల్లో మూడు సెంచరీలు సాధించాడు.

నాలుగో వికెట్కు 82 పరుగుల భాగస్వామ్యం
ఆసీస్ బౌలర్ రిచర్డ్సన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన కోహ్లీ (104; 112 బంతులు, 5 ఫోర్లు, 2 సిక్స్లు) బౌండరీ లైన్ వద్ద మ్యాక్స్వెల్ క్యాచ్ పట్టడంతో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. దీంతో నాలుగో వికెట్కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. భారత ఇన్నింగ్స్లో ఇదే అతిపెద్ద భాగస్వామ్యం కావడం గమనార్హం.

రన్రేట్ తగ్గకుండా జాగ్రత్త
అనంతరం క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్(25 నాటౌట్)తో కలిసి ధోని(55 నాటౌట్) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. వీరిద్దరూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ రన్రేట్ తగ్గకుండా జాగ్రత్తగా ఆడారు. చివరి ఓవర్లో భారత విజయానికి 7 పరుగులు కావాల్సి ఉండగా.. తొలి బంతిని ధోని అద్భుతంగా సిక్స్ బాదాడు. ఈ సిక్స్తో ధోని కెరీర్లో 69వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, ఈ సిరీస్లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం.

మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం
54 బంతుల్లో 55 పరుగులు చేసిన ధోని ఒక్క ఫోర్ లేకుండా.. రెండు సిక్స్లు బాదాడు. మరుసటి బంతిని ధోని సింగిల్ తీయడంతో భారత్.. నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో బెహ్రన్డార్ఫ్, రిచర్డ్సన్, స్టొయినిస్, మ్యాక్వెల్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications