హైదరాబాద్: కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (92), జో రూట్ (71) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో దంబుల్లా వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే.
ఇక, రెండో వన్డేకు కూడా వర్షం ఆటంకం కలిగించడంతో ఇంగ్లాండ్ డక్వర్త్ లూయిస్ పద్దతిన విజేతను ప్రకటించారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. మోర్గాన్ (92), రూట్ (71) రాణించారు.
ఈ మ్యాచ్లో లంక పేసర్ మలింగ నాలుగేళ్ల తర్వాత 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 279 పరుగుల లక్ష్యఛేదనలో లంక 29 ఓవర్లలో 140/5తో ఎదురీదుతున్న సమయంలో భారీ వర్షం కురవడంతో మిగతా ఆట సాధ్యపడలేదు. అప్పటికి శ్రీలంక డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లక్ష్యానికి 31 పరుగుల దూరంలో నిలిచింది.
దీంతో మ్యాచ్ను నిలిపేసిన అంపైర్లు మెరుగైన రన్రేట్ ఉన్న ఇంగ్లాండ్ను విజేతగా ప్రకటించారు. శ్రీలంక ఆటగాళ్లలో ధనంజయ డిసిల్వా (36 నాటౌట్), పెరీరా (44 నాటౌట్) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్కు 3 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్లో లంక పేసర్ మలింగ(5/44)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఐదు వన్డేల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరుగనుంది.